Andhra Pradesh: కోరికలు తీరాలంటే మగాళ్లు కోక కట్టాల్సిందే.. ఈ వింత ఆచారం వెనుకున్న అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Andhra Pradesh: కోరికలు తీరాలంటే మగాళ్లు కోక కట్టాల్సిందే.. ఈ వింత ఆచారం వెనుకున్న అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు..


హోలీ పండుగ అంటే రంగులు చల్లుకోవడం మనకు తెలుసు. కానీ కర్నూలు జిల్లాలోని ఒక గ్రామంలో మాత్రం హోలీ వచ్చిందంటే చాలు.. ఊరంతా జంబలకడిపంబ సినిమాను తలపిస్తుంది. మగవారంతా చీరలు కట్టి, ముస్తాబై మహిళలుగా మారిపోతారు. వినడానికి వింతగా ఉన్నా.. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఒక బలమైన నమ్మకం దాగుంది. అదోని మండలం సంతే కుడ్లూరు గ్రామంలో ఈ వింత సంప్రదాయం కొనసాగుతోంది. హోలీ పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు జరిగే వేడుకల్లో గ్రామంలోని పురుషులంతా మహిళా వేషధారణలోకి మారిపోతారు. చీరలు కట్టుకుని, నగలు ధరించి అచ్చం ఆడవారిలాగే కనిపిస్తూ గ్రామంలో సందడి చేస్తారు.

రతీ మన్మథుల పూజ

శుక్రవారం హోలీ పండుగ నాడు ఈ పురుషులంతా మహిళా వేషధారణతో గ్రామంలో వెలిసిన రతీ మన్మథులను దర్శించుకుంటారు. పట్టుచీరలు కట్టుకుని వెళ్లి ఆ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇది కేవలం సరదా కోసం చేసే పని కాదు.. తరతరాలుగా తమ పూర్వీకుల నుండి వస్తున్న పవిత్ర సంప్రదాయమని గ్రామ పెద్దలు గర్వంగా చెబుతున్నారు. ఇలా మహిళా వేషధారణలో దేవుడిని దర్శించుకుంటే అసాధ్యమైన కోరికలు కూడా సుసాధ్యం అవుతాయని భక్తుల నమ్మకం. త్వరగా వివాహం జరగాలని మొక్కుకుంటారు, పిల్లలు కలగాలని వేడుకుంటారు, పంటలు బాగా పండాలని, గ్రామానికి ఎలాంటి కష్టాలు రాకూడదని దేవుళ్లను కోరుకుంటారు.

గతంలో మొక్కుకున్న కోరికలు తీరిన వారు.. ఈ హోలీ నాడు కృతజ్ఞతగా చీర కట్టుకుని వచ్చి దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. సంతే కుడ్లూరులో జరిగే ఈ వింత వేడుకలను చూడటానికి కేవలం ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా.. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రతీ మన్మథుల ఆశీస్సుల కోసం వేల సంఖ్యలో భక్తులు రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *