ఏపీలోని మందుబాబులకు ఊరట కలిగించే నిర్ణయం త్వరలో కూటమి ప్రభుత్వం తీసుకొనుంది. త్వరలో ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీని తీసుకురానుంది. మద్యం షాపులు, బార్లలో డిజిటల్ పేమెంట్స్ను ప్రవేశపెట్టడం కోసం ప్రత్యేక పాలసీని అమలు చేయనుంది. ఆ పాలసీ పేరే లిక్కర్ డిజిటల్ చెల్లింపులు. ఈ పాలసీ ద్వారా తప్పనిసరిగా ప్రతీ షాపు, బార్లలో డిజిటల్ పేమెంట్స్ చేసే సౌకర్యాన్ని మందుబాబులకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. దీని వల్ల కస్టమర్లు సులువుగా పేమెంట్ చేసే సౌలత్యంతో పాటు మద్యం విక్రయాల్లో పారదర్శకత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పాలసీ అమల్లోకి వచ్చాక షాపుల యజమానులు కస్టమర్ల నుంచి ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్స్ స్వీకరించాల్సి ఉంటుంది. వాటిని తిరస్కరించడం కుదరదు.
నెల రోజుల్లో అమలు
ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ ఈ డిజిటల్ విధానం ఫైల్ను సిద్దం చేసింది. రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ పాలసీని కేబినెట్ ముందు ఉంచనుంది. కేబినెట్ ఆమోదం తెలిపాక ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం డిజిటల్ విధానంలో మద్యం కొనుగోలుదారుల నుంచి షాపుల యజమానులు పేమెంట్లు స్వీకరిస్తున్నా.. శాశ్వత విధానంలో దీనిని అమలు చేసేందుకు పాలసీ తీసుకొస్తున్నారు. దీని వల్ల ఇక ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్స్ స్వీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం షాపులు, బార్లకు అవసరమైన పరికరాలను కూడా ఎక్సైజ్ శాఖ అందించనుంది. ప్రస్తుతం మద్యం విక్రయాల్లో 30 శాతం వరకు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. దీనిని 60 శాతంకు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేందుకు కూడా కొత్త నిర్ణయం ఉపయోగపడుతుందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
సీరియస్గా తీసుకోని యజమానులు
ప్రస్తుతం రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్లలో డిజిటల్ పేమెంట్ నిబంధన అమల్లో ఉంది. కానీ షాపుల యాజమానులు సీరియస్గా తీసుకోవడం లేదు. ప్రతీసారి పాలసీలో ఈ నిబంధన పొందుపర్చాల్సి వస్తోంది. దీంతో శాశ్వతంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక పాలసీకి రూపకల్పన చేశారు. ఇక నుంచి డిజిటల్ పేమెంట్స్ అన్నీ రియల్ టైమ్లో ఎక్సైజ్ శాఖ డేటాబేస్లో నిక్షప్తం అవుతాయి. దీని వల్ల ఏ రోజు ఎంత మద్యం విక్రయాలు జరిగాయనే సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఉత్పత్తి నుంచి అమ్మకం వరకు ప్రతీచోట డిజిటల్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోనుంది. ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని ఇందుకోసం తీసుకురానుంది. ప్రతీ షాప్, బార్కు ప్రభుత్వమే స్కానర్ ఇస్తుంది. ఖచ్చితంగా స్కాన్ చేసిన తర్వాతే కొనుగోలుదారులకు సీసా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కొనుగోలుదారులు పేమెంట్ చేస్తే ఎక్సైజ్ శాఖకు తెలుస్తుంది.