అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల సంఖ్య, ఆయా ఖాళీలను ఎప్పటిలోగా పూర్తిచేస్తారని శాసనమండలిలో సభ్యుడు బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించి 3 నెలల్లో అవసరమున్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఖాళీల భర్తీకి 2018, 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోవడంతో 2023 నోటిఫికేషన్ ను కోర్టు తప్పుబట్టింది. దీంతో సదరు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే మేం ఏఏజీతో మూడుసార్లు సమావేశం కావడం జరిగింది. పూర్తిస్థాయిలో చర్చించాం. నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని మేం నిర్ణయం తీసుకున్నాం. యుద్ధప్రాతిపదికన పెండింగ్ పోస్టులను వచ్చే మూడు నెలల్లో భర్తీ చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని తెలిపారు.
గత ప్రభుత్వంలో రాజకీయ కోణంలో కొన్ని అపాయింట్ మెంట్లు జరిగాయని. దీనివల్ల యూనివర్సిటీల్లో ఎంతమంది సిబ్బంది అవసరం, ఎవరు ఏ పనిచేస్తున్నారో మ్యాన్ పవర్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడిట్ పూర్తి అయిన తర్వాత స్పష్టత వస్తుందని.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 150 రోజుల్లో డీఎస్సీ పూర్తిచేసి16వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. దానికి కారణం గత నోటిఫికేషన్లలో తప్పులు సరిదిద్దడమే అని పేర్కొన్నారు. దీని పరిష్కరించేందుకు కమిటీ వేసి కచ్చితంగా అమలుచేశామని.. ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందని.. వయస్సు విషయానికి వస్తే ఇప్పటికే జీవోఎం ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం ఉందని తెలిపారు. ఉన్నత విద్యలో పలు సంస్కరణలు తీసుకువచ్చి కమిషనరేట్లను కూడా బలోపేతం చేస్తామన్నారు. అన్ని సమస్యలపై తాను వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నానన్నారు. నియామకాలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని.. తప్పనిసరిగా యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.