ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.83 లక్షల క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. ఈరోజు రాత్రికి మొదటి హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం రాత్రి లేదా సోమవారానికి దాదాపు రెండవ హెచ్చరిక స్ఠాయికి కృష్ణా వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు.
మరోవైపు గోదావరి నది వరద భద్రాచలం వద్ద 44.5 అడుగులు ఉందని, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 10.14 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి హెచ్చరిక కొనసాగుతుందని వెల్లడించారు. ఆదివారం దాదాపుగా 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేశామని, క్షేత్రస్థాయిలో అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి 24/7 అందుబాటులో ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అలెర్ట్ మేసేజ్లు పంపిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు. కృష్ణా, గోదావరి నదీపరీవాహక, లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.
ఆదివారం (28-09-2025) : ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం నాటికి ఉత్తర, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..