Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!

Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!


ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామంలో 2005లో ప్రతిష్టించబడిన ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ పాండురంగ మాల ధరిస్తే మద్యం అలవాటు మానిపోతుందనే గట్టి విశ్వాసం. ప్రతి ఏకాదశి రోజున దాదాపు రెండు వేల మంది వరకు మద్యానికి బానిసైన వారు స్వామివారి మాల ధరించి దీక్ష తీసుకుంటున్నారు. ఒకసారి మాల వేసుకున్న తర్వాత మద్యం ముట్టుకుంటే స్వామి ఆగ్రహానికి గురవుతామనే భయం వారిలో బలంగా ఉంది. అదే భయం.. వారిని మళ్లీ మందు వైపు వెళ్లకుండా అడ్డుకుంటోంది.

మాలధారణ 41 రోజుల దీక్ష. ఈ కాలంలో తెల్లవారుజామునే స్నానం, నిత్యం భజనలు, ప్రార్థనలు చేయడం, సాత్విక ఆహారం తీసుకోవడం, నేలపైనే పడుకోవడం వంటి కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా జీవనశైలిలో వచ్చే మార్పే జీవితానికి కొత్త మలుపు. ఏకంగా 41 రోజుల పాటు ఇవన్నీ పాటించడం వల్ల మద్యం తాగాలి అన్న ఆలోచనే క్రమంగా తగ్గిపోతుందని మాలధారులు చెబుతున్నారు.

మద్యం వల్ల కూలిపోయిన కుటుంబాలు.. అమ్ముడైన ఆస్తులు.. చిచ్చుపెట్టుకున్న సంసారాలు.. ఇవన్నీ ఇక్కడ వినిపించే కథలు. కానీ మాల వేసుకున్న తర్వాత అలవాటు మానేసి మంచి జీవితాన్ని ప్రారంభించిన వారే ఇప్పుడు ఈ దేవాలయానికి సజీవ సాక్ష్యాలు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ప్రతి నెల ఏకాదశి రోజున వచ్చి మాల ధరించడం విశేషం. కొంతమంది డి-అడిక్షన్ సెంటర్ల చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చు చేసి విసిగిపోయినవారే. కానీ ఉంతకల్లులో మాత్రం భక్తితో, ఉచితంగా మాలధారణ చేసి అలవాటు మానేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

41 రోజుల దీక్ష పూర్తయ్యాక కూడా చాలామంది మళ్లీ మద్యం జోలికి వెళ్లకపోవడం భక్తుల నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. అందుకే ఈ చిన్న గ్రామంలోని పాండురంగ స్వామి ఆలయం ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక డి-అడిక్షన్ సెంటర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. మరి ఇది విశ్వాసమా? దైవానుగ్రహమా..? లేక రెండింటి కలయికా? జవాబు కోసం ఉంతకల్లు వెళ్లాల్సిందే.

Also Read: ఏదో డ్యామేజ్ వచ్చి ఇలా వేశారు అనుకునేరు.. పాపం ఆ రైతు.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *