
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీవో సువర్ణపై మూకుమ్మడిగా కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చారు వీఆర్వోలు. ఆధార్ అప్డేట్ విషయంలో వెనకబడ్డారంటూ వీఆర్వోతో గుంజీలు తీయించారంటూ ఫిర్యాదు చేశారు. పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయంలో ఆధార్ అప్డేషన్పై వీఆర్వోలకు ప్రత్యేక శిక్షణ ప్రోగ్రామ్ జరిగింది. ఈ ట్రైనింగ్ సెషన్లో ఒడిసి మండలం వీఆర్వోపై మండిపడ్డారు ఆర్డీవో సువర్ణ. ఆధార్ అప్డేట్లో బాగా వెనకబడ్డారంటూ ఫైర్ అయ్యారు. ఆర్డీవో సువర్ణ అడిగిన ప్రశ్నలకు వీఆర్వో సమాధానం ఇచ్చాడు. ఆధార్ అప్డేషన్ జరగకపోవడానికి కారణాలను వివరించాడు. చాలామంది బెంగళూరుకు వలస వెళ్లారని.. వాళ్లు వచ్చేంతవరకూ ఆధార్ అప్టేషన్ చేయలేమంటూ ఆర్డీవోకి సమాధానం ఇచ్చాడు వీఆర్వో.. అంతే, ఆర్డీవో సువర్ణకు సర్రున కోపమొచ్చింది. ఎప్పుడూ ఒకే కారణం చెబుతూ తప్పించుకుంటావా అంటూ సువర్ణ మండిపడ్డారు..
అంతటితో ఆగకుండా, ఆధార్ అప్టేషన్లో వెనకబడినందుకు గుంజీలు తీయాలంటూ ఆర్డీవో సువర్ణ ఆదేశించారు. ఆర్డీవో ఆర్డర్ వేయడంతో చేసేదేమీలేక.. మిగతా వీఆర్వోల ముందే గుంజీలు తీశాడు. దాంతో, అక్కడున్న వీఆర్వోలందరూ ఆర్డీవో సువర్ణపై ఎదురుతిరిగారు. ఏంటీ నియంతృత్వ పోకడ అంటూ ఆమెతో వాగ్వాదానికి దిగారు. గుంజీలు తీయించడం సరికాదంటూ ఆర్డీవోకు సూచించారు. గుంజీలు తీయించడం ఆపాలని విజ్ఞప్తిచేశారు.
ఎంత విన్నవించుకున్నా, ఎంతమంది చెప్పినా వినకుండా వీఆర్వోతో గుంజీలు తీయించారు ఆర్డీవో. దాంతో, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు వీఆర్వోలు. తమను అవమానించారంటూ ఆర్డీవో సువర్ణపై కలెక్టర్ శ్యాంప్రసాద్కు ఫిర్యాదు చేశారు. మొత్తం ఘటనపై విచారణ జరిపి, ఆర్డీవో సువర్ణపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు వీఆర్వోలు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..