Abhishek Sharma : ఆసియా కప్ 2025 లో భారత యువ సంచలనం అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగుతోంది. పాకిస్తాన్పై మెరుపు ఇన్నింగ్స్ తర్వాత, తాజాగా బంగ్లాదేశ్పై కూడా అతడు సునామీ సృష్టించాడు. ఈ క్రమంలో తన గురువుగా భావించే దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న ఒక అరుదైన T20I రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. కేవలం 25 బంతుల్లో మరోసారి హాఫ్ సెంచరీ సాధించి, ఏకంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ వంటి స్టార్లతో కూడిన ఎలైట్ క్లబ్లో చేరాడు.
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి రెడ్-హాట్ ఫామ్ను కొనసాగించాడు. బంగ్లాదేశ్తో జరిగిన ఈ కీలక పోరులో అభిషేక్ కేవలం 25 బంతుల్లో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఘనతతో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్, దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఫాస్ట్ ఫీట్ చేయడం అతడి కెరీర్లో ఇది ఐదోసారి. యువరాజ్ సింగ్ కేవలం నాలుగు సార్లు మాత్రమే ఈ ఘనతను సాధించాడు.
సూర్యకుమార్ యాదవ్ క్లబ్లో చోటు
అభిషేక్ శర్మ తన ఐదో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో టీమిండియాలోని అత్యంత వేగవంతమైన బ్యాటర్ల ఎలైట్ జాబితాలో చేరాడు. ఈ జాబితాలో ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏడు సార్లు చేసి అగ్రస్థానంలో ఉండగా, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆరుసార్లు ఈ ఘనత సాధించాడు. అభిషేక్ శర్మ (5) ఇప్పుడు యువరాజ్ సింగ్ (4) కేఎల్ రాహుల్ (3) కంటే ముందు స్థానంలో ఉన్నాడు. ఈ గణాంకాలు టీ20 ఫార్మాట్లో అభిషేక్ ఎంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్గా మారుతున్నాడో తెలియజేస్తున్నాయి.
పాకిస్తాన్పై వీరోచిత ప్రదర్శన
అంతకుముందు, పాకిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ ఒక రికార్డును బద్దలు కొట్టాడు. ఆ మ్యాచ్లో కేవలం 24 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి, చిరకాల ప్రత్యర్థిపై టీ20 ఇంటర్నేషనల్స్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్లో 74 పరుగులు చేసిన అభిషేక్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ తర్వాత పాకిస్తాన్పై అత్యధిక స్కోరు సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.
అభిషేక్ స్కోరు, సెలబ్రేషన్
బంగ్లాదేశ్పై కూడా అభిషేక్ తన జోరును కొనసాగించాడు. వైస్-కెప్టెన్ శుభ్మన్ గిల్ తో కలిసి 77 పరుగుల అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 75 పరుగుల వద్ద అతడు రనౌట్ అయ్యాడు. ఈ స్కోరు (75) పాకిస్తాన్పై చేసిన స్కోరు (74)కు దాదాపు సమానంగా ఉండటం విశేషం.
అభిషేక్ ఆటతీరుతో పాటు, అతడి సెలబ్రేషన్ కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. పాకిస్తాన్పై లవ్ ను సూచించే L సైన్ చూపించిన తర్వాత, బంగ్లాదేశ్పై హాఫ్ సెంచరీ కొట్టగానే దుబాయ్లోని స్టాండ్స్ వైపు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. వెంటనే కెమెరాలు అతని సోదరి కోమల్ శర్మ వైపు మళ్లాయి. ఆమె తన సోదరుడి మైలురాయిని గర్వంగా మొబైల్లో రికార్డ్ చేస్తూ కనిపించింది. ఈ స్పెషల్ సెలబ్రేషన్ ఆమె కోసమే అని తేలింది.