బంగారం.. భారతీయులకు ఒక ఎమోషన్. ముఖ్యంగా మహిళలకు బంగారంపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. చాలా మంది బంగారాన్ని ఆభరణంగా, ఆస్తిగా, రేపటికి భరోసాగా, స్టేటస్గా చూస్తుంటారు. అలాంటి బంగారం ధర ఇప్పుడు భారీగా పెరిగిపోయంది. తులం కొనాలన్నా అమ్మో అనేలా ఉంది రేటు. మరి ఇలాంటి పరిస్థితిల్లో కేవలం ధరించడానికే కాకుండా బంగారాన్ని ఒక పెట్టబడి మార్గంగా కూడా చూడొచ్చు. మరి బంగారంపై పెట్టుబడి పెట్టే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో సాధారణంగా ఎక్కువమంది డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుందని బంగారు నగలు కొనేస్తుంటారు. ఒకరకంగా తెలియకుండానే దానిపై పెట్టుబడి పెట్టడ అన్నమాట. ఇవి జీవితకాలపు జ్ఞాపకాలతో పాటు ఆర్థిక భద్రతనూ ఇస్తాయి. అయితే ఇవి కొనుగోలు చేసే సమయంలో బంగారం ధరను తెలుసుకోవడం కీలకం. అంతేకాకుండా తయారీ ఖర్చులు, జీఎస్టీ వల్ల మళ్లీ అమ్మే సమయంలో కొద్దిగా నష్టపోవాల్సి ఉంటుంది.
గోల్డ్ కాయిన్స్, బార్లు.. తయారీ ఖర్చులు లేకుండా శుద్ధమైన బంగారాన్ని కొనాలనుకునే వారికి నాణేలు, బార్లు ఉత్తమమైన ఎంపిక. ఇవి వివిధ బరువుల్లో, అత్యంత స్వచ్ఛత స్థాయిల్లో లభిస్తాయి. బ్యాంకులు, జువెలర్స్ వద్ద వీటిని కొనవచ్చు. గోల్డ్ ETFలు.. బంగారాన్ని ప్రత్యక్షంగా కొనకుండా.. స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ ETFs అనువైన మార్గం. ఇవి నిజమైన బంగారంతో బ్యాక్ చేయబడి ఉంటాయి. స్టాక్ల మాదిరిగానే ట్రేడ్ చేయవచ్చు.
డిజిటల్ గోల్డ్.. పెట్టుబడికి డిజిటల్ గోల్డ్ ఒక ఉత్తమ మార్గం. కేవలం రూ.10 నుంచి ఇందులో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దొంగతనం భయం లేదా తయారీ ఖర్చులు ఉండవు. అయితే జీఎస్టీ ఉంటుంది. కొనే రేటు కంటే అమ్మే రేటు తక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు.
సావరిన్ గోల్డ్ బాండ్లు (SGBs).. భౌతిక బంగారం కాకుండా ప్రభుత్వ హామీతో బంగారంపై పెట్టుబడి పెట్టే పద్ధతి SGBs(సావరిన్ గోల్డ్ బాండ్లు). ఇవి రిజర్వ్ బ్యాంక్ ద్వారా జారీ అవుతాయి. వీటిపై ప్రతి సంవత్సరం 2.5 శాతం వడ్డీతో పాటు బంగారం ధర పెరిగితే అదనపు లాభం కూడా లభిస్తుంది. గడువు వరకు ఉంచితే పన్ను లాభాలు ఉంటాయి. ప్రస్తుతం కొత్త ఇష్యూ అందుబాటులో లేకపోయినా, సెకండరీ మార్కెట్లో కొనుగోలు చేసే అవకాశం ఉంది.