Asia Cup Controversy : ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ లకు మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించింది. అయితే, ఈ ఐసీసీ నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అప్పీల్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ హారిస్ రవూఫ్ జరిమానాను స్వయంగా చెల్లిస్తానని ప్రకటించారు. అసలు సూర్యకుమార్, రవూఫ్లపై జరిమానా ఎందుకు విధించారు? దీని వెనుక ఉన్న పూర్తి వివరాలు చూద్దాం.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025లో ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. గురువారం, శుక్రవారం జరిగిన సమావేశాలలో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించినందుకు ఐసీసీ వారిపై చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్లకు వారి మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించారు. అయితే, పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన గన్ సెలబ్రేషన్కు కేవలం హెచ్చరికతో సరిపెట్టబడ్డాడు.
సూర్యకుమార్ యాదవ్కు జరిమానా విధించడానికి కారణం, సెప్టెంబర్ 14న పాకిస్తాన్పై భారత్ విజయం సాధించిన తర్వాత అతను చేసిన వ్యాఖ్యలే. ఆ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు, భారత సాయుధ బలగాలకు అంకితం చేస్తున్నట్లు సూర్యకుమార్ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు రాజకీయ స్వభావం కలవని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది. సూర్యకుమార్ తాను తప్పు చేయలేదని వాదించినప్పటికీ, టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్లలో రాజకీయంగా చేయబడే ప్రకటనలు చేయకుండా ఉండాలని అతనికి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా బీసీసీఐ ఐసీసీ తీర్పుపై అప్పీల్ చేయాలని నిర్ణయించింది. ఈ అప్పీల్పై తుది నిర్ణయం ఆసియా కప్ సెప్టెంబర్ 28న ముగిసిన తర్వాత వెలువడే అవకాశం ఉంది. మొదట్లో, సూర్యకుమార్పై ఐసీసీ అధికారికంగా ఎటువంటి అభియోగాలు మోపలేదని నివేదించబడింది.
మరోవైపు ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ గ్రూప్ మ్యాచ్లో హారిస్ రవూఫ్ చేసిన వివాదాస్పద సెలబ్రేషన్లకు విధించిన జరిమానాను, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా చెల్లిస్తానని ప్రకటించారు. రవూఫ్కు మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించారు. అతని రెచ్చగొట్టే చర్యలలో విమానాలను కూల్చే సంజ్ఞలు, భారత ఓపెనర్లతో వాగ్వాదం, బౌండరీ దగ్గర అభిమానులకు అనుచితమైన సంకేతాలు ఉన్నాయి. అతను దుర్భాషలాడినందుకు కూడా అతనిపై నివేదించబడింది.
ఇదే సమయంలో తన హాఫ్ సెంచరీని గన్-షాట్ సంజ్ఞతో జరుపుకున్న పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్కు కేవలం హెచ్చరిక మాత్రమే లభించింది. అతనికి ఎలాంటి నగదు జరిమానా విధించబడలేదు. పాకిస్తాన్ ఆటగాళ్లకు సంబంధించిన క్రమశిక్షణా విచారణను మ్యాచ్ రెఫరీ రిచీ రిచర్డ్సన్ దుబాయ్లోని వారి టీమ్ హోటల్లో నిర్వహించారు. హారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ ఇద్దరూ స్వయంగా విచారణకు హాజరయ్యారు, అయితే వారి సమాధానాలను రాతపూర్వకంగా సమర్పించారు. విచారణ సమయంలో వారికి టీమ్ మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా తోడుగా ఉన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..