బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.. ప్రస్తుతం వాయుగుండం.. వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల్లో కొనసాగుతోంది.. గడిచిన 6 గంటల్లో, గంటకు 10కిమీ వేగంతో కదిలిన వాయుగుండం.. ప్రస్తుతానికి పూరికి 60 కి.మీ. గోపాల్పూర్(ఒడిశా)కి 70కి.మీ.,కళింగపట్నం(ఏపీ)కి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది.. మరికాసేపట్లో వాయుగుండం.. గోపాల్పూర్కు దగ్గరగా దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలలో దాటనుంది. దీనికి తోడు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మీ మధ్యలో ద్రోణి కొనసాగుతోంది.. వాయుగుండం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ.. నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ వెదర్ రిపోర్ట్..
వాయుగుండం, ద్రోణి ప్రభావంతో శనివారం, ఆదివారం తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు తెలంగాణలోని హనుమకొండ, జనగాం, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నల్లగొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఈరోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ఏపీలో భారీ వర్షాలు..
కాగా.. వాయుగుండం ప్రభావతో ఆంధప్రదేశ్ లో కూడా భారీ వర్సాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..