దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన సివిల్ సర్వీసెస్లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూకు చేరిన స్కిల్ ఉన్న వ్యక్తి… చివరికి సైబర్ నేరగాడిగా మారిపోయాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన డాక్టర్ సీతయ్య లండన్లో మాస్టర్స్, పీహెచ్డీ పూర్తి చేసి, హైదరాబాద్లో ప్రొఫెసర్గా పని చేశాడు. కలెక్టర్ కావాలన్న కలతో సివిల్స్ రాశాడు. ఫస్ట్ అటెంమ్ట్లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లినా, ఫైనల్ లిస్ట్లో స్థానం దక్కలేదు.
ఈ పరిణామంతో అతని జీవితం ఊహించని టర్న్ తీసుకుంది. ఉద్యోగం వదిలేశాడు. భార్య వదిలి వెళ్లిపోయింది. సివిల్స్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని చూసినా.. ప్రయత్నాలు ముందుకు సాగలేదు. డిప్రెషన్లో ఉన్న సీతయ్య ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ, బెట్టింగ్ యాప్స్కు బానిసయ్యాడు. డబ్బు కోసం మోసాల బాట పట్టాడు. జాబ్ పోర్టల్స్ నుంచి అభ్యర్థుల వివరాలు సేకరించి, నకిలీ ఆఫర్ లెటర్లు ఇస్తూ భారీగా డబ్బు కాజేశాడు. 2023 నుంచి ఇలా చేస్తూ.. జైలుకు వెళ్లి వచ్చినా కూడా తీరు మార్చుకోలేదు.
తాజాగా పుణేలోని ప్రముఖ యూనివర్సిటీ వీసీ, సీఈఓలను టార్గెట్ చేసి.. తాను ఐఐటీ బాంబే ప్రొఫెసర్నని చెప్పి నమ్మించాడు. 28 కోట్ల ఫండింగ్ ఇస్తానంటూ చెప్పి.. ముందుగా 2.46 కోట్లు తన అకౌంట్లో జమ చేయించుకున్నాడు. తర్వాత కనబడకపోవడంతో యూనివర్సిటీ అధికారులు సైబర్ క్రైమ్ సెల్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ట్రేస్ చేసి సెప్టెంబర్లో యాప్రాల్లో ఉన్న సీతయ్యను అరెస్ట్ చేశారు. కలెక్టర్ కావాల్సిన వ్యక్తి, చివరికి కస్టడీలో ఖైదీగా మారిపోయాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.