
తక్కువ టైంలో ఎక్కువ దూరాన్ని కవర్ చేసే ట్రైన్స్ గా వందేభారత్ ట్రైన్స్ బాగా పాపులర్ అయ్యాయి. కేవలం ఆరు లేదా ఏడు గంటల్లో గమ్యాన్ని చేరుకోవడం ఈ ట్రైన్స్ స్పెషాలిటీ. అయితే ప్రస్తుతం వందేభారత్ ట్రైన్స్ లో సీటింగ్ ఆప్షన్ మాత్రమే ఉంది. స్లీపర్ సౌకర్యం కూడా ఉంటే బాగుంటుందని రైల్వే ప్రయాణికులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే ఎట్టకేలకు వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తున్నట్టు తెలుస్తుంది.
దీపావళి నుంచి..
వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభంపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. దీపావళి నాటికి ఈ స్లీపర్ రైళ్లు సిద్దం అవుతాయని ప్రకటించారు. ఇప్పటికే ఒక రైలు రెడీ అవ్వగా రెండో రైలు నిర్మాణంలో ఉందని తెలిపారు. ఈ రైళ్లను ఒకే సారి ప్రారంభిస్తామని చెప్పారు. మొదటి సర్వీస్.. పాట్నా, ఢిల్లీ మధ్యన ఉంటుంది. మిగతా సిటీలకు కూడా త్వరలోనే సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సదుపాయాలు ఇవే..
వందేభారత్ స్లీపర్ రైలు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతోంది. 16 కోచ్లతో ఉండే వందే భారత్ స్లీపర్రైలు గంటకు 180కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణీకుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఉంటాయని చెప్తున్నారు. రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే కవచ్ అనే వ్యవస్థ ఉంటుంది. అలాగే అన్ని కోచ్లు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో తయారుచేశారు. ఫైర్ యాక్సిడెంట్స్ ను తట్టుకునేలా వీటిని రూపొందించారు. వీటితోపాటు ట్రైన్స్ లో ఆటోమేటిక్ డోర్లు, అప్ డేటెడ్ మరుగు దొడ్లు, సరికొత్త సీటు కుషన్లు ఉంటాయి. వందేభారత్ స్లీపర్ ట్రైన్ లో 16 కోచ్లు, 823 బెర్త్లు ఉంటాయి. ఇందులో 3టైర్ ఏసీ కోచ్లు 11, 2 టైర్ ఏసీ కోచ్లు 4, ఒక ఫస్ట్ టైర్ ఏసీ కోచ్ ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి