ప్రపంచంలోనే పూర్తిగా కృష్ణశిలలతో పునర్ నిర్మించిన ఏకైక ఆలయంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పునర్నిర్మాణం తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా పర్వదినాలు, సెలవుల్లో భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ ఘాట్ రోడ్డు పై వాహనాలు బారులు తీరుతున్నాయి. కొన్నిసార్లు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు పర్యటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘పర్వతమాల పరియోజన’ ప్రాజెక్టును అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 200 రోప్వేలను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు త్వరలో రోప్వే సౌకర్యం కల్పనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపైకి 1.1 కిలోమీటర్ల మేర రోప్ వే నిర్మించనున్నారు. ఈ రోపేను ఏర్పాటు చేస్తే భక్తులు నేరుగా కొండపైకి వెళ్లవచ్చు. దీంతో కొండపైకి ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు భక్తులకు ప్రత్యేక అనుభూతి కలగనుంది.
ఈ ‘పర్వతమాల పరియోజన’ కింద యాదగిరిగుట్టతో పాటు తెలంగాణలోని మరికొన్ని పర్యటక ప్రాంతాల్లో రోప్వే సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)nపరిధిలోని జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (NHLML)కు కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. యాదగిరి కొండకు 1.1 కి.మీ, నల్లగొండలోని హనుమాన్ కొండకు 1.2 కి.మీ, నాగార్జునకొండ నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ వరకు 1.7కి.మీ., పెద్దపల్లి జిల్లా మంథనిలోని రామగిరికోటకు 2.4 కి.మీ మేర రోప్ వే కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్న హాలు చేస్తోంది. ఈ నాలుగు రోప్వేల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ కోసం NHAI బిడ్లను ఆహ్వానించింది. బిడ్లను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 21గా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందనీ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే యాదాద్రి జిల్లాలో భువనగిరి కోటపై రోప్ వే ఏర్పాటుకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ రోప్వేలు భవిష్యత్తులో పర్యాటక రంగానికి, ప్రజల సౌకర్యంతోపాటు ప్రత్యేక అనుభూతిని కూడా కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోప్ వే లు పూర్తయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్టకు భక్తులు, నాగార్జున సాగర్ కు వచ్చే పర్యాటకులు పెరగనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.