Abhishek Sharma : విరాట్ కోహ్లీ తర్వాత ఆసియా కప్ T20 చరిత్రలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్గా యువ సంచలనం అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు! బంగ్లాదేశ్తో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో ఈ ఫీట్ సాధించిన అభిషేక్, ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్గా పేరు తెచ్చుకుంటున్నాడు. అతని విధ్వంసకరమైన బ్యాటింగ్తో భారత్ ఫైనల్కి దూసుకెళ్లింది.
అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో అతను ఆడుతున్న ప్రతి గేమ్లో మెరుపు ఇన్నింగ్స్లతో జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తున్నాడు. బంగ్లాదేశ్ తో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
అయితే, ఈ ఫిఫ్టీతో అతను ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఆసియా కప్ T20 ఫార్మాట్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఇంతకు ముందు ఈ ఫీట్ సాధించింది విరాట్ కోహ్లీ మాత్రమే. అంతకుముందు జరిగిన పాకిస్తాన్తో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో కూడా అభిషేక్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి, మొత్తం 74 పరుగులు (39 బంతుల్లో) చేశాడు. ఆ జోరును బంగ్లాదేశ్పై కూడా కొనసాగించి, కేవలం 37 బంతుల్లోనే 75 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
అభిషేక్ శర్మ ఆడుతున్న దూకుడు, అతని స్టైల్ చూసి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అయితే ఏకంగా అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపిస్తూ ఒక ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన T20I ఓపెనర్ అభిషేక్ శర్మ అంటూ ఇర్ఫాన్ పఠాన్ తన X ఖాతాలో పేర్కొన్నాడు. అభిషేక్ బ్యాటింగ్లో ఉన్న విధ్వంసం అలాంటిది.
బంగ్లాదేశ్పై జరిగిన ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ కొంత తడబడినప్పటికీ, ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ ధాటిగా ఆడి 77 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని (శుభ్మన్ గిల్తో కలిసి) అందించాడు. అతని ఈ మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారత్ 168 పరుగులు చేయగలిగింది. చివరకు భారత్ 41 పరుగుల తేడాతో గెలిచి, ఆసియా కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
సిక్సర్ల రికార్డు బద్దలు
వరుస హాఫ్ సెంచరీలు మాత్రమే కాదు, ఈ టోర్నమెంట్లో అభిషేక్ శర్మ మరెన్నో సంచలన రికార్డులను కూడా నెలకొల్పాడు. ముఖ్యంగా అతని సిక్సర్ల సునామీకి బ్యాటింగ్లో కొత్త చరిత్ర నమోదైంది.
ఒకే ఆసియా కప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు: అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 17 సిక్సర్లతో టాప్లో ఉన్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు సనత్ జయసూర్య (2008లో 14 సిక్సర్లు) పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు.
ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్: బంగ్లాదేశ్పై అతను చేసిన 25 బంతుల్లో హాఫ్ సెంచరీ, అతని T20I కెరీర్లో 25 బంతుల్లోపు చేసిన 5వ హాఫ్ సెంచరీ. ఈ రికార్డులో సూర్యకుమార్ యాదవ్ (7), రోహిత్ శర్మ (6) తర్వాత అభిషేక్ మూడవ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తన మెంటార్ అయిన యువరాజ్ సింగ్ (4) రికార్డును కూడా దాటేశాడు.
పాక్ పై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: పాకిస్తాన్పై అతను 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి, భారత్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డును నెలకొల్పాడు.
ప్రస్తుతం ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా (248 పరుగులు) అభిషేక్ శర్మ నిలిచాడు. ఇలా తన విద్వంసకరమైన బ్యాటింగ్తో, రికార్డుల మోత మోగిస్తూ.. భారత క్రికెట్ భవిష్యత్తును ముందుండి నడిపిస్తున్నాడు ఈ యంగ్ సెన్సేషన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..