అల్లం గారెలు ఆంధ్రాలో ఒక స్పెషల్ అల్పాహారం. ఇవి బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి అద్భుతమైన రుచిని ఇస్తాయి. వాటిని ఇంటి వద్ద సులభంగా తయారు చేయవచ్చు. ఈ రెసిపీని అనుసరించి ఎవరైనా రుచికరమైన అల్లం గారెలు చేయవచ్చు. దసరా నవరాత్రుల్లో నైవేద్యంగా వీటిని ఉంచి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.
కావాల్సిన పదార్థాలు
పొట్టు మినపప్పు: రెండు కప్పులు
అల్లం: 20 గ్రాములు
పచ్చిమిర్చి: 10
ఉల్లిపాయ: ఒకటి
కొత్తిమీర: ఒక చిన్న కట్ట
కరివేపాకు: నాలుగు రెమ్మలు
నూనె: అర కిలో
ఉప్పు: తగినంత
తయారీ విధానం
ముందుగా పొట్టు మినపప్పును ఐదు గంటల పాటు నానబెట్టాలి. పొట్టు మినపప్పును మూడు, నాలుగు సార్లు కడిగి పొట్టును తీసివేయండి. మినపగుళ్ళను బాగా కడిగి, వడగట్టండి.
వడగట్టిన పప్పును గ్రైండర్ లో నీళ్లు పోయకుండా, మధ్య మధ్యలో నీళ్లు చిలకరిస్తూ గట్టిగా గ్రైండ్ చేయండి.
గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, చిన్న ముక్కలుగా తరిగిన అల్లం, ఉల్లిపాయలు, మెత్తగా దంచిన పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి చేతితో బాగా కలపండి.
ఈ పిండిని ఒక అరగంట సేపు ఫ్రిజ్ లో ఉంచండి. అలా చేస్తే గారెలు మెత్తగా వస్తాయి.
ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసి బాగా వేడి చేయండి. తర్వాత మంటను మీడియంలో పెట్టండి.
ఒక చిన్న అరిటాకును లేదా ఒక చిన్న మైనపు కవరును తీసుకుని ఎడమ చేతిలో పెట్టుకోండి. కుడి చేతితో పిండి తీసుకుని, నిమ్మకాయంత ఉండలా చేయండి.
తడి చేసుకున్న అరిటాకు లేదా కవర్ మీద పెట్టి, గుండ్రంగా ఒత్తి మధ్యలో చిన్న రంధ్రం చేయండి. దానిని కాగుతున్న నూనెలో జాగ్రత్తగా వేయండి.
ఇలా నాలుగైదు గారెలు చొప్పున వేసుకుని, అట్లకాడతో అటు ఇటు తిప్పుతూ బంగారు రంగులో వేయించండి.