Sourav Ganguly : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిరిగి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా వెళ్లే ముందు ఆయన ఈ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ అదే పదవిలోకి వచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గంగూలీ ఒక సంచలన ప్రకటన చేశారు.
సోమవారం జరిగిన సీఏబీ 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఈ పదవికి ఎంపికయ్యారు. 2015 నుంచి 2019 వరకు సీఏబీ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ, ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో అవిషేక్ దాల్మియా సీఏబీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఇప్పుడు మళ్లీ ఆరేళ్ల తర్వాత సొంత గడ్డపై తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించనున్నారు.
సీఏబీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే గంగూలీ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంపై దృష్టి పెట్టారు. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కెపాసిటీని లక్ష వరకు పెంచే ప్రణాళిక ఉన్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత ఈ పని మొదలు పెడతామని గంగూలీ తెలిపారు. ఈ స్టేడియం కెపాసిటీ పెరగడానికి సమయం పడుతుందని, ఇది సుదీర్ఘమైన ప్రక్రియ అని కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా, టీ20 ప్రపంచ కప్లోని ముఖ్యమైన మ్యాచ్లను ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని కూడా ఆయన అన్నారు.
గంగూలీ సీఏబీ అధ్యక్షుడిగా రాగానే టెస్ట్ క్రికెట్ మీద కూడా దృష్టి పెట్టారు. ఈడెన్ గార్డెన్స్లో టెస్ట్ మ్యాచ్లు సజావుగా జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్టోబర్లో ఇక్కడ రంజీ ట్రోఫీ మ్యాచ్లు, నవంబర్లో భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
ఈ టెస్ట్ మ్యాచ్ గురించి గంగూలీ మాట్లాడుతూ.. “ఇది ఒక మంచి టెస్ట్ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఇటీవల ఆస్ట్రేలియాను ఓడించి సౌతాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ అయింది. ఈడెన్ గార్డెన్స్లో మంచి పిచ్లు, మంచి ప్రేక్షకులు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రెండు జట్లు కూడా మంచి ఫామ్లో ఉన్నాయి, కాబట్టి మ్యాచ్ అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను” అని అన్నారు.
గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే భారతదేశంలో పింక్ బాల్ డే-నైట్ టెస్ట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. 2019లో బంగ్లాదేశ్తో జరిగిన పింక్ బాల్ టెస్ట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
బీసీసీఐలోని కొత్త సభ్యులతో త్వరలోనే చర్చిస్తానని గంగూలీ తెలిపారు. “నేను బీసీసీఐతో మాట్లాడతాను. వారు కూడా కొత్త సభ్యులు. కొత్త బీసీసీఐ అధ్యక్షుడికి నా శుభాకాంక్షలు. అతను బాగా పనిచేస్తారని నేను నమ్ముతున్నాను” అని గంగూలీ చెప్పారు. సెప్టెంబర్ 28న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో సీఏబీ తరపున గంగూలీ ప్రాతినిధ్యం వహిస్తారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..