తిరుమల శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వామివారి సలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు రానేవచ్చేశాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ బ్రహ్మోత్సవాలకు ఈ రోజు సాయంత్రం వేదం పండితులు అంకురార్పణ చేయనున్నారు. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు రాత్రి 7గంటల నుంచి 8 గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది.
స్వామివారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.
సేనాధిపతి ఉత్సవం: ఈ సందర్భంగా శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని పురాణ ప్రాశస్త్యం.
ఇవి కూడా చదవండి
ముందుగా మేదినిపూజ: అంకురార్పణ సమయంలో వేసే నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.
అంకురార్పణ: వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా మట్టికుండల్లో పుట్టమన్ను నింపుతారు. ఈ కుండల్లో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు.. అంటే సూర్యుడుకి సంకేతంగా గోధుమలు, చంద్రుడుకి సంకేతంగా బియ్యం , కుజుడుకి సంకేతంగా కందులు, బుధుడుకి సంకేతంగా పెసలు, బృహస్పతికి సంకేతంగా శనగలు, శుక్రుడుకి సంకేతంగా అలసందలు, శనీశ్వుడికి సంకేతంగా నువ్వులు, రాహువుకి మినుములు , కేతువుకు ఉలవలును పోస్తారు.ఇలా పోసిన నవధాన్య విత్తనాలు బాగా మొలకెత్తాలని.. సమస్త భూమండలం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. అంతేకాదు యాగశాలలో ఈ మట్టి కుండల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.
అక్షతారోపణ: ఈ మట్టి కుండల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాలు జరిగీ తొమ్మిది పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత సంప్రదాయంగా.. ఘనంగా జరిగినట్లు భక్తుల విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు