సినిమాల్లో చూసే కొన్ని కథలు నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా నేరాలను దాచిపెట్టడానికి నేరగాళ్లు చేసే పనులు విస్తుపోయేలా చేస్తాయి. యూపీలోని మొరాదాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అమాయకులను ఇరికించడానికి హంతకులే చేసిన ఒక ఫోన్ కాల్ చివరికి వారిని ఎలా పట్టించిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సెప్టెంబర్ 18న ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్లోని పక్బాడా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల పెయింటర్ యోగేష్ అగ్వాన్పూర్ బైపాస్లోని ఒక స్మశానవాటిక సమీపంలో చనిపోయి కనిపించాడు. అతని తల, ముఖంపై తీవ్ర గాయాలు ఉండడంతో ఇది హత్యగా పోలీసులు నిర్ధారించారు. హత్య జరిగిన తర్వాత యోగేష్ ఫోన్ నుండి డయల్-112 కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను యోగేష్ అని ముగ్గురు వ్యక్తులు తనను కొడుతున్నారని చెప్పి సహాయం కోసం వేడుకున్నాడు. ఈ కాల్ హఠాత్తుగా డిస్కనెక్ట్ అయ్యింది. మొదట పోలీసులు ఈ కాల్ ఆధారంగా విచారణ ప్రారంభించారు.
పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కాల్ రికార్డులను పరిశీలించగా అది యోగేష్ గొంతు కాదని తేలింది. హంతకులే యోగేష్ ఫోన్ను ఉపయోగించి పోలీసులను తప్పుదోవ పట్టించారని దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితుడు మనోజ్.. యోగేష్ గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. అయితే వారి ప్రేమకు ఆ యువతి తండ్రి, సోదరుడు అడ్డు చెప్పారు. దీంతో వారిపై మనోజ్ వారిపై పగ పెంచుకున్నాడు. తన బంధువు మంజీత్తో కలిసి యోగేష్ను చంపి.. ఆ నేరాన్ని యువతి తండ్రి, సోదరుడిపై మోపాలనే కన్నింగ్ ప్లాన్ చేశాడు.
ఈ నేపథ్యంలో యేగేష్ను దారుణంగా చంపేసి.. అతడి ఫోన్తోనే పోలీసులకు ఫోన్ చేశాడు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. పోలీసులు గాలిస్తుండగా.. మనోజ్, మంజీత్లు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపగా.. మనోజ్కు గాయాలయ్యాయి. ప్రస్తుతం పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..