ఈ మధ్య కాలంలో భార్యభర్తల హత్యలు కలవరపెడుతున్నాయి. ప్రియుడు కోసం భార్యలు భర్తను కడతేర్చుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అదే సమయంలో అనుమానం తో పాటు చిన్న చిన్న విషయాలకే భార్యలను కిరాతకంగా చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే మేడ్చల్ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను దారుణంగా చంపి ముక్కలు చేశాడు. ఈ ఘటన మరవరక ముందే హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానంతో ఓ భర్త తన భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎస్రావు నగర్ అనుపురం కాలనీలో జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బోడ శంకర్, మంజుల దంపతులు బతుకుదెరువు కోసం ముంబైలో ఉన్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. కొంతకాలంగా శంకర్ తన భార్య మంజులపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడేవాడు. భర్త వేధింపులు భరించలేక మంజుల ఈ నెల 14న హైదరాబాద్లోని తన అక్క ఇంటికి వచ్చింది. శంకర్ కూడా తన పిల్లలతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. శుక్రవారం పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో ఇకపై మంజులను ఇబ్బంది పెట్టనని శంకర్ మాటిచ్చాడు. అదే రోజు రాత్రి, అక్క రాణి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా శంకర్ కత్తితో మంజుల గొంతు కోసి ఆమెను చంపేశాడు.
భార్యను దారుణంగా చంపిన తర్వాత శంకర్ డోర్ పెట్టేసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో మంజుల అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంజూల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. భర్త చేసిన పనితో పిల్లలు తల్లిదండ్రులు లేని వారయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.