Headlines

Watch: బ్రిక్స్ సదస్సుకు వచ్చి వెళ్తూ.. డ్రైవర్‌తో అబుదాబి యువరాజు చేసిన పనికి నెటిజన్లు ఫిదా!


న్యూఢిల్లీ: పెద్దలు, ప్రముఖులు, సామాన్యులు.. ఎవరు ఎదురైనా గౌరవంగా పలకరించడం గొప్ప సంస్కారానికి నిదర్శనంగా భావిస్తారు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను సురక్షితంగా తీసుకువచ్చిన డ్రైవర్‌ను ప్రత్యేకంగా పలకరించి, కరచాలనం చేసి వెళ్లిన ఆయన తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

18వ బ్రిక్స్ సదస్సు కోసం న్యూఢిల్లీకి వచ్చిన షేక్ ఖలీద్.. సదస్సు ముగిసిన అనంతరం విమాన ప్రయాణానికి బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు నుంచి దిగిన ఆయన అక్కడ ఉన్న ప్రముఖులకు అభివాదం చేశారు. అనంతరం ముందుకు వెళ్తున్న సమయంలో తన డ్రైవర్‌ను పలకరించలేదని గుర్తించినట్లుగా కనిపించింది. వెంటనే ఆయన వెనక్కి తిరిగి కారు వద్దకు వెళ్లారు. డ్రైవర్‌తో కరచాలనం చేసి, కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాతే అక్కడి నుంచి బయలుదేరారు. అతను భారతదేశానికి చెందిన డ్రైవర్ కావడం విశేషం. కేవలం కొన్ని క్షణాల పాటు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చిన్న చర్య.. పెద్ద సందేశం

సాధారణంగా ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ చుట్టూ ఉండే సిబ్బందిని పలకరించడం అరుదుగా కనిపిస్తుంటుంది. అయితే యువరాజు షేక్ ఖలీద్ స్వయంగా వెనక్కి తిరిగి డ్రైవర్‌ను పలకరించడంతో ఆయన వినయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పదవి ఎంత ఉన్నతంగా ఉన్నా.. తమతో పనిచేసే వ్యక్తులను గౌరవించడం గొప్ప లక్షణమని కామెంట్లు చేస్తున్నారు.

ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు

18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా షేక్ ఖలీద్ ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున ఆయన భారత్‌కు వచ్చారు. ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, కృత్రిమ మేధస్సు, ఆర్థిక సహకారం, విద్య, పర్యాటకం తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, ప్రాంతీయ భద్రత, భారతీయ నావికుల భద్రత, బ్రిక్స్‌లో యూఏఈ భాగస్వామ్యం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సదస్సుకు పలువురు ప్రపంచ దేశాల నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అయితే అంతర్జాతీయ స్థాయి చర్చల కంటే.. ఓ డ్రైవర్‌ను పలకరించేందుకు యువరాజు వెనక్కి తిరిగిన కొన్ని క్షణాల వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచింది. పదవికంటే మనిషిని గౌరవించడమే గొప్పదనే సందేశాన్ని ఈ చిన్న ఘటన మరోసారి గుర్తుచేసిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *