Headlines

Credit Card: క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే అదనంగా 2 శాతం అడుగుతున్నారా..? నో వర్రీ.. ఈ రూల్స్‌తో మీకే లాభం..


ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం అనేది పెరిగిపోతుంది. ఎవరి చేతుల్లో చూసినా కార్డులు కనిపిస్తున్నాయి. షాపింగ్ ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం ఎక్కువమంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డులు ఉపయోగించి దుకాణాల్లో ఖరీదైనవి ఏమైనా కొనుగోలు చేసినప్పుడు అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డు ద్వారా చేసే పేమెంట్స్‌కు మొత్తం బిల్లుపై అదనంగా 2 శాతం చెల్లించాలని అడుగుతుంటారు. క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసినందుకు ఛార్జీలు పడతాయని, అందుకే చెల్లించాలని షాపు నిర్వాహకులు చెబుతుంటారు. దీంతో కొంతమంది చేసేదేమి లేక అదనపు చెల్లింపులు చేస్తూ ఉంటారు. అయితే ఈ అదనపు రుసుంలు నిజంగా చెల్లించాల్సిదేనా..? అవసరం లేదా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

2 శాతం ఎందుకు అదనంగా చెల్లించాలి..?

క్రెడిట్ కార్డుల ద్వారా కస్టమర్లు చేసే పేమెంట్స్‌పై షాపు యజమాని మర్చంట్ డిస్కౌంట్ రేటు భరించాల్సి ఉంటుంది. అంటే.. యజమానికి కొంత రుసుం పడుతుంది. బ్యాంకులు, కార్డు జారీ చేసే సంస్థలు, పేమెంట్ ప్రొవైడర్లు, కార్డ్ నెట్‌వర్క్ సంస్థలు వీటిని వ్యాపారుల నుంచి వసూలు చేస్తాయి. దీంతో వ్యాపారులు ఈ సొమ్మును కస్టమర్ల నుంచి వసూలు చేస్తూ ఉంటారు. కస్టమర్ల బిల్లులో వీటిని చేర్చడం ద్వారా తమ ఖర్చులను తిరిగి రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇలాంటి సమయంలో షాపు యజమానిని కస్టమర్ ప్రశ్నించవచ్చు. లేదా కార్డు జారీ చేసిన సంస్థ దృష్టికి దీనిని తీసుకెళ్లవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు విధించలేదు. క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఛార్జీలు సంబంధించి ఆర్బీఐ ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. వ్యాపారులు, కార్డ్ నెట్ వర్క్ సంస్థల మధ్య ఒప్పందాల్లో భాగంగా ఈ చార్జీలు దాగి ఉంటాయి.

డెబిట్ కార్డు చార్జీలపై ఆర్బీఐ రూల్స్

అయితే డెబిట్ కార్డు నియమాలు మరోలా ఉంటాయి. డెబిట్ కార్డు లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేటు విధింపునకు సంబంధించి ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లకు అదనపు రుసుంను వినియోగదారులపై వేయకుండా వ్యాపారులు, చెల్లింపు భాగస్వాములు భరించాలి. ఒకవేళ దుకాణాదారుడు మిమ్మల్ని చెల్లించమని అడిగితే.. ఎందుకోసం అనేది అడిగి తెలుసుకోండి. మీ బిల్లులో చేర్చి ఉంటే కార్డు జారీ చేసిన సంస్థను సంప్రదించండి. ఒకవేళ కార్డు జారీ చేసిన సంస్థ సరైన సమాధానం ఇవ్వకపోతే ఆర్‌బిఐ ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్‌మన్ స్కీమ్‌ ద్వారా ఫిర్యాదు చేయండి. కార్డు జారీదారుడి నుంచి నెల రోజుల్లోగా సమాధానం రాకపోతే ఆర్బీఐ ఓంబుడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *