Headlines

Telangana: వామ్మో.. జర్రుంటే ఎంతపనయ్యేది.. ఏం జరిగిందో వీడియోలో చూడండి..


కరీంనగర్ నగర నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ స్టేడియం సమీపంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ వాహనాలు, ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ ద్విచక్రవాహనంలోకి నాగుపాము చొరబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సుమారు అరగంట పాటు ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. అంబేద్కర్ స్టేడియం వద్ద పార్క్ చేసిన బైక్‌పై కూర్చునే క్రమంలో వాహనదారుడికి ఓ విషసర్పం కనిపించింది. అప్రమత్తమైన సదరు వ్యక్తి వెంటనే బైక్ దిగి దూరంగా జరిగాడు. ఆ తర్వాత ఆ నాగుపాము బైక్ హెడ్‌లైట్ గుండా లోపలికి వెళ్లి, సీటు కింది భాగంలో దాక్కుంది. లోపలికి వెళ్లిన పాము ఎంతసేపటికీ కనిపించకపోవడంతో వాహనదారుడితో పాటు చుట్టుపక్కల వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మెకానిక్ రాకతో వీడిన ఉత్కంఠ

పాము ఎక్కడ ఉందో తెలియకపోవడంతో వెంటనే స్థానిక బైక్ మెకానిక్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మెకానిక్, అత్యంత చాకచక్యంగా బైక్ సీటు భాగాలను తొలగించారు. దాంతో లోపల దాక్కున్న నాగుపాము మెల్లగా బయటకు వచ్చింది. అనంతరం అది పక్కనే ఉన్న నాలాలోకి వెళ్లిపోవడంతో వాహనదారుడు, స్థానికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వాహనదారులకు నిపుణుల హెచ్చరిక

సాధారణంగా నాగుపాములు చిన్న శబ్దానికే దూరంగా వెళ్లిపోతాయని, అలాంటిది ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలో నేరుగా వాహనంలోకి ఎలా దూరిందనేది స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. వర్షాకాలం, చల్లటి వాతావరణంలో వాహనాల ఇంజిన్ వెచ్చదనం కోసం పాములు ఇలా దూరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెట్లు, ముళ్లపొదలు, డ్రైనేజీల సమీపంలో బైక్‌లు పార్క్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణానికి ముందు వాహనాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే తీయాలని మెకానిక్‌లు సూచిస్తున్నారు.

వీడియో చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *