
ఈజీ మనీకోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా వరికోత మిషన్ పేరుతో ఓ రైతుకు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.30వేలు కాజేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పులబోయిన భూపాల్కు ఏప్రిల్ 15న 9154178931 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తన పేరు సుధాకర్ అని పరిచయం చేసుకున్నాడు.
తన వద్ద వరికోత మిషన్ ఉందని, అవసరమైతే పంపిస్తానని చెప్పాడు..వరికోత మిషన్ అవసరం ఉందని భూపాల్ చెప్పడంతో..మిషన్ను అక్కడికి పంపించేందుకు డీజిల్ ఖర్చుల కోసం రూ.30 వేలు ముందుగా పంపించాలని నిందితుడు కోరాడు..అతన్ని నమ్మిన భూపాల్..తన ఫోన్ నుంచి రూ.20 వేలు, తన స్నేహితుడి ఫోన్ నుంచి మరో రూ.10 వేలు బదిలీ చేశాడు. మొత్తం రూ.30 వేలు జమ చేసిన వెంటనే అవతలి వ్యక్తి తన ఫోన్ను స్విచ్ఛాఫ్ చేశాడు.
ఎంతసేపటికీ ఫోన్ అందుబాటులోకి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన భూపాల్.. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశాడు..బాధితుడి ఫిర్యాదుపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు..సంబంధిత బ్యాంకు ఖాతాను గుర్తించి, అందులో ఉన్న రూ.21 వేల నగదును ఫ్రీజ్ చేశారు. దీంతో మొత్తం రూ.30 వేలలో రూ.21 వేలు రికవరీ అయ్యే అవకాశం ఏర్పడింది..ఈ ఘటనపై బుధవారం కేసు నమోదు చేశారు పోలీసులు..రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఆన్లైన్లో వ్యవసాయ యంత్రాలు,ఎరువులు, విత్తనాలు,ఇతర వ్యవసాయ అవసరాల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు అడిగితే వెంటనే స్పందించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా ముందుగా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేసే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.