చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని అడవి బూదుగూరు గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామస్తులు సంప్రదాయ వలస దేవర పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఆదివారం ఉదయం గ్రామాన్ని ఖాళీ చేసి సమీప అడవికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆచారంలో మహిళలు, పురుషులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాభావ పరిస్థితులు తొలగి చెరువులు, కుంటలు నిండాలని, రైతులకు మంచి పంటలు రావాలని కోరుతూ సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు.
వీడియో చూడండి..
విశేషం ఏమిటంటే.. గ్రామస్తులు పూజలు చేస్తున్న సమయంలోనే ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దీంతో ఆనందోత్సాహాలకు లోనైన గ్రామస్తులు కేరింతలు కొడుతూ వరుణ దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. పూజలు ఫలించాయని, దేవుని కరుణతో వర్షం కురిసిందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానికంగా తరతరాలుగా కొనసాగుతున్న ఈ వలస దేవర ఆచారాన్ని ప్రతి ఏడాది వర్షాభావం ఏర్పడిన సమయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ పూజల ద్వారా ప్రకృతి అనుగ్రహం లభిస్తుందని, మంచి వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు నమ్మకం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి