
T20 Cricket Records: టీ20 క్రికెట్ అంటేనే బౌండరీల మోత, పరుగుల సునామీ గుర్తుకొస్తాయి. అలాంటి ఫార్మాట్లో ఒక అంతర్జాతీయ జట్టు కేవలం 6 పరుగులకే ఆలౌట్ అయిందంటే నమ్మగలరా? కనీసం రెండు అంకెల స్కోరు కూడా చేయలేక క్రికెట్ చరిత్రలోనే ఎవరూ కోరుకోని అత్యంత సిగ్గుచేటైన ఘోర రికార్డును మూటగట్టుకుంది.
క్రికెట్ మైదానంలో ఎన్నో అద్భుతాలు, సంచలనాలు మనం చూస్తుంటాం. కొన్ని మ్యాచులు ఇచ్చే థ్రిల్ నభూతో నభవిష్యతి అనిపిస్తుంది. అయితే, కొన్ని రికార్డులు మాత్రం సంబంధిత జట్టును జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. దక్షిణ ఆసియా క్రీడల్లో భాగంగా జరిగిన ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో ఇలాంటి విపరీత పరిణామమే చోటుచేసుకుంది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి తాళలేక ఒక జట్టు పట్టుమని పది పరుగులు కూడా చేయలేక చేతులెత్తేసింది.
బౌండరీల వర్షంతో చెలరేగిన బ్యాటర్లు..
ఆ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళల జట్టు పరుగుల తుఫాన్ సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. జట్టులోని నిగార్ సుల్తానా, ఫర్గానా హక్ చెలరేగిపోయి చెరో సెంచరీతో విరుచుకుపడ్డారు. మూడో వికెట్కు ఏకంగా 236 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. నిగార్ సుల్తానా 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 113 పరుగులు చేయగా, ఫర్గానా హక్ 20 ఫోర్లతో 110 పరుగులు సాధించి పరుగుల పండగ చేసుకున్నారు.
6 పరుగులకే కుప్పకూలిన మాల్దీవులు..
256 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన మాల్దీవులు మహిళల జట్టుకు ప్రారంభం నుంచే తీవ్ర గండం ఎదురైంది. బంగ్లాదేశ్ బౌలర్ల ప్రాణాంతక బౌలింగ్ను తట్టుకోలేక క్యూ కట్టారు. పవర్ ప్లే ముగిసేసరికి అంటే మొదటి 5 ఓవర్లలోనే కేవలం 3 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయి ఘోరమైన స్థితికి చేరుకున్నారు.
షాకింగ్ విషయం ఏమిటంటే, జట్టులోని తొమ్మిది మంది బ్యాటర్లు కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే పరుగులు సాధించగలిగారు. షమ్మా అలీ 2 పరుగులు, కినాత్ ఇస్మాయిల్, సాజా ఫాతిమత్ చెరో ఒక పరుగు మాత్రమే చేశారు. దాంతో మొత్తం జట్టు 12.1 ఓవర్లలో కేవలం 6 పరుగులకే కుప్పకూలిపోయి పరాభవాన్ని మూటగట్టుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..