IPL 2027 : ఐపీఎల్ 2027 సీజన్కి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని 10 ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ జట్లను బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. ట్రేడింగ్ విండో అధికారికంగా ప్రారంభం కావడంతో ఇతర జట్లలో ఉన్న స్టార్ ప్లేయర్లపై ప్రధాన ఫ్రాంచైజీలు కన్నేశాయి. తమ జట్టులోని లోపాలను సరిదిద్దుకునేందుకు ట్రేడింగ్ చర్చలు మొదలుపెట్టాయి. రాబోయే కొన్ని నెలల్లో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా అనేకమంది అగ్రశ్రేణి ఆటగాళ్లు వేరే జట్లకు మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
1. సీఎస్కే వైపు హార్దిక్ పాండ్యా అడుగులు?
రాబోయే రోజుల్లో జరగబోయే అత్యంత హై-ప్రొఫైల్ ట్రేడ్ డీల్స్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, హార్దిక్ కూడా సీఎస్కేకి మారడానికి సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే 19 ఏళ్ల సీఎస్కే స్టార్ యంగ్ ప్లేయర్ ఆయుష్ మ్హాత్రే కోసం ఏకంగా 5 జట్లు (DC, SRH, LSG, GT, MI) పోటీ పడుతున్నాయి. భవిష్యత్తు తారగా భావిస్తున్నందున మ్హాత్రేను వదులుకోవడానికి సీఎస్కే సిద్ధంగా లేకపోయినప్పటికీ, మైండ్ బ్లోయింగ్ ఆఫర్ వస్తే ట్రేడ్ చేసే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
2. విల్ జాక్స్, సాయి కిషోర్లపై చెన్నై కన్ను
ముంబై ఇండియన్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఇంగ్లాండ్ అల్ రౌండర్ విల్ జాక్స్ వైపు కూడా చెన్నై సూపర్ కింగ్స్ మొగ్గు చూపుతోంది. ఐపీఎల్ 2026లో మ్యాథ్యూ షార్ట్ తీవ్రంగా విఫలం కావడం, గాయాల బారిన పడటంతో ఒక క్వాలిటీ ఓవర్సీస్ ఆల్రౌండర్ కోసం సీఎస్కే అన్వేషిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన విల్ జాక్స్ టాప్ 6 లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు, పూర్తి 4 ఓవర్లు బౌలింగ్ కూడా చేయగలడు. ఇక జడేజా, అశ్విన్ల స్థానాలను భర్తీ చేయడానికి స్థానిక చెన్నై బౌలర్, గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ ఆర్. సాయి కిషోర్ను కూడా ట్రేడ్ ద్వారా తీసుకోవడానికి సీఎస్కే సిద్ధమవుతోంది.
3. ముంబై ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్?
రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై ఇండియన్స్లోకి మారే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ముంబైకి చెందిన జైస్వాల్, భవిష్యత్తులో రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత జట్టుకు దీర్ఘకాలిక ఓపెనర్గా పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతాడని ముంబై మేనేజ్మెంట్ భావిస్తోంది. అలాగే సంజూ శామ్సన్ రాజస్థాన్ రాయల్స్ వీడిన తర్వాత కెప్టెన్సీని ఆశించిన జైస్వాల్ను కాదని, యాజమాన్యం రియాన్ పరాగ్కు కెప్టెన్సీ ఇవ్వడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో లోకల్ బాయ్ అయిన జైస్వాల్ను తమ వైపు తిప్పుకోవడానికి ముంబై ప్రయత్నాలు వేగవంతం చేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..