అయితే సరైన కొలతలు, నాణ్యమైన పాకం బెల్లం మరియు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే అచ్చం గుడిలో లభించే చక్కెర పొంగలిని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేయవచ్చు. ఈ చక్కెర పొంగలి తయారీకి ముందుగా ఒక కప్పు బియ్యం, అర కప్పు పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి.
పప్పు, బియ్యం బాగా నానితే పొంగలి మెత్తగా, గుల్లగా ఉడుకుతుంది. నానిన బియ్యం, పప్పును కుక్కర్లో వేసి మూడు కప్పుల నీళ్లు పోసి, నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్పై ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత గరిటెతో మరీ మెత్తగా కాకుండా, లైట్గా పలుకు కనిపించేలా మెదుపుకోవాలి.
ఇప్పుడు పొంగలికి అసలైన రుచినిచ్చే బెల్లం పాకం సిద్ధం చేయాలి. ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల మంచి పాకం బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లంలో అర కప్పు నీళ్లు పోసి కరిగే వరకు మరిగించాలి. కరిగిన బెల్లం నీటిని ఉడికించి పెట్టుకున్న అన్నం-పెసరపప్పు మిశ్రమంలోకి వడగట్టి పోయాలి. సన్నటి మంటపై బెల్లం సిరప్ అన్నంలో బాగా కలిసేలా రెండు నిమిషాలు ఉడికించాలి.
ఆ తర్వాత అర కప్పు తాజా నెయ్యి వేసి బాగా కలపాలి. ఇందులో మంచి పరిమళం కోసం ఒక టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం చల్లి తిప్పాలి. పచ్చకర్పూరం వేయడం వల్లనే అచ్చం గుడి ప్రసాదం సువాసన లభిస్తుంది. చివరగా వేరొక పాత్రలో మూడు చెంచాల నెయ్యి వేసి సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, మరియు ఎండుద్రాక్షలను దోరగా ఎర్రగా వేయించాలి.
ఈ నేతి తాలింపును డ్రై ఫ్రూట్స్తో సహా తయారు చేసుకున్న పొంగలిలో వేసి కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు పొంగలికి ప్రత్యేకమైన క్రంచ్ ఇస్తాయి. ఇలా తయారు చేసిన వేడి వేడి చక్కెర పొంగలిని దేవునికి నైవేద్యంగా సమర్పించి ఆరగిస్తే ప్రతి ముద్దలోనూ అమృతతుల్యమైన తృప్తి లభిస్తుంది.




