రైల్వే ప్రయాణికులకు వెస్ట్ సెంట్రల్ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారీ ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి, ఏజెంట్ల దందాను అరికట్టడానికి ఆగస్టు 1 నుండి కొత్త టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా బుకింగ్ ప్రారంభ సమయానికి ముందే టోకెన్లు పంపిణీ చేయడమే కాకుండా.. ఏసీ, నాన్-ఏసీ బుకింగ్ వేళలు, టోకెన్ల సంఖ్యపై పలు కీలక మార్పులు చేసింది. ఈ కొత్త టోకెన్ విధానం ప్రకారం.. ప్రయాణికులు కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా బుకింగ్ ప్రారంభ సమయానికి ముందే టోకెన్లు పంపిణీ చేయనున్నారు. ప్రతి రోజు ఉదయం 8:30 గంటల నుండి 9:00 గంటల వరకు AC కోచ్ తత్కాల్ టిక్కెట్లు అందజేయనున్నారు. అలాగే ఉదయం 9:00 గంటల నుండి 9:30 గంటల వరకు Non-AC , స్లీపర్ కోచ్ తత్కాల్ టిక్కెట్లును జారీ చేస్తారు.
అయితే కౌంటర్ల వద్ద తోపులాటను అరికట్టేందుకు గాను ప్రతి రిజర్వేషన్ కౌంటర్ వద్ద టోకెన్ల సంఖ్యపై పరిమితి విధించారు. ఒక కౌంటర్కు గరిష్టంగా 10 AC తత్కాల్ టోకెన్లు మాత్రమే ఇస్తారు. అలాగే 15 నాన్ఏసీ స్లీపర్ టోకేన్లు మాత్రమే జారీ చేస్తారు. కొత్త నిబంధనల ప్రకారం.. తమ సొంత ప్రయాణం కోసం లేదా తమ ఫ్యామిలీ మెంబర్స్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వచ్చే వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఏజెంట్ల దందాను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు ఉన్న విధానంలో టోకెన్ తీసుకోవడానికి ఒకసారి, టిక్కెట్ బుకింగ్ కోసం మరోసారి క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ తాజా రైల్వే శాఖ నిర్ణయంతో పదే పదే కౌంటర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకేసారి టికెట్లు తీసుకోవచ్చు. దీని వల్ల టైం కూడా ఆదా అవుతుంది. ముందే టోకెన్ వేళలు స్పష్టంగా ఉండటం వల్ల కౌంటర్ల వద్ద గందరగోళం కూడా తగ్గుతుంది.
టిక్కెట్ బుకింగ్ సమయాల్లో ఇవి తప్పనిసరి
- ఈ తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవడానికి కౌంటర్కు వెళ్లే ప్రయాణికులు ఈ క్రింది వాటిని కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని అధికారులు తెలిపారుజ
- గుర్తింపు కార్డు: తమ వెంట ఆధార్ కార్డ్ లేదా ఏదైనా అధికారిక ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
- ముందస్తు వివరాలు: ప్రయాణించే వారి పేర్లు, వయస్సు, రైలు వివరాలు ముందే ఒక కాగితంపై రాసి సిద్ధంగా ఉంచుకుంటే బుకింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.