రంపచోడవరంలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య విషాదాన్ని నింపింది. 3 రోజుల క్రితం ఏపీ సీఎం పర్యటనలో చలాకీగా కనిపించిన విద్యార్థినికి సడెన్గా ఏమైందో ఏమో కానీ ప్రాణాలు తీసుకుంది. షైనింగ్ స్టార్ అవుతానని చంద్రబాబుతో చెప్పిన శివాని ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ మీరు ఎప్పటికైనా కలవండి.. ద్వేషించుకోకండి అంటూ నోట్ రాసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
కుటుంబ కలహాలు టీనేజీ గుండెలపై ఎంత భారాన్ని మోపుతాయో చెప్పే ఉదంతం ఇది. కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకున్న ఆ పాప.. అది నెరవేరక ఎలా ప్రాణం తీసుకుందో చెప్పే ఘటన ఇది. ఇంతకీ ఆ ప్రాణం తీసుకున్న పాప ఎవరో తెలుసా. సర్, నేను ఏదైనా సాధిస్తాను. మీ చేతుల మీదుగా అవార్డ్ తీసుకుంటాను అంటూ చంద్రబాబుకు చెప్పిన బాలిక.
సరిగ్గా మూడు రోజుల క్రితం, ఈ నెల 24న చంద్రబాబు రంపచోడవరం టూర్లో మెరిసిన పాప ఈమె. పేరు శివాని. ఇర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఈ పాప అనూహ్యంగా సూసైడ్ చేసుకుంది. సారీ అమ్మా, క్షమించు నాన్నా అంటూ సూసైడ్ నోట్ రాసింది. ‘అమ్మా ,నాన్నా మీ కోసం చాలా కష్టపడదాం అనుకున్నాను. మీరు కలలుగన్న జీవితం మీకిద్దాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. బతకాలని ఉంది గానీ, బతకడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ఈ బాధ మోయడం నావల్ల కావడం లేదు’ అంటూ సూసైడ్ నోట్లో ఆ పాప రాసిన ఆ లేఖ చూస్తుంటే కళ్లు చమర్చుతున్నాయి. ఆ పాప చివరికోరిక ఏంటంటే అన్నయ్యా-వదినా, అమ్మా..అమ్మమ్మా మీరు ఎప్పటికైనా కలవాలి. ద్వేషించుకోకండి.. సారీ, బైబై అంటూ జీవితాన్ని ముగించింది
కానీ, ఇదే శివానీ, ఈ నెల 24 చంద్రబాబు టూర్లో చాలా ధైర్యంగా కనిపించింది. తల్లికివందనం కార్యక్రమంలో చక్కగా మాట్లాడింది. తాను షైనింగ్ స్టార్ అవుతానని, చంద్రబాబు నాయుడు నుంచే అవార్డ్ తీసుకుంటానని చెప్పింది. ఆ విద్యార్థి మాటలకు ఆ రోజు సీఎం ముగ్దులయ్యారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. సెల్ఫీ దిగారు. ఫ్యూచర్లో ఆమె ప్రతిదీ తనకు రిపోర్ట్ చేయాలని చెప్పారు. అంత చురుగ్గా కనిపించిన శివానీ ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..