
హైదరాబాద్లోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బోరబండ ప్రాంతంలోని పీలీ దర్గా సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు నగదు విత్డ్రా చేసేందుకు వెళ్లాడు ఓ కస్టమర్. అదే సమయంలో లోపల ఒక వ్యక్తి హాయిగా నిద్రపోతుండటాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏటీఎం కేంద్రంలో అనధికార వ్యక్తి ఇలా ఉండటం చూసి ఆయన ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేశాడు.
ఈ ఘటనతో స్థానిక నివాసితులు బ్యాంకుల భద్రతా వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నగదు లావాదేవీలు జరిగే అత్యంత సున్నితమైన ప్రాంతమైన ఏటీఎం కేంద్రంలో ఎవరైనా సులభంగా ప్రవేశించి గంటల తరబడి ఉండగలిగితే, వినియోగదారుల భద్రతకు ఎంతటి ముప్పు ఉంటుందో ఈ ఘటన స్పష్టం చేస్తోందని వారు అంటున్నారు. చాలాచోట్ల ఏటీఎంల వద్ద భద్రతా సిబ్బంది లేకపోవడం, సీసీటీవీ నిఘా సక్రమంగా లేకపోవడం, తరచూ తనిఖీలు జరగకపోవడం వంటి సమస్యలను వారు ప్రస్తావిస్తున్నారు.
ఏటీఎం కేంద్రాల్లోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతా సిబ్బందిని నియమించడంతో పాటు సీసీటీవీ పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని స్థానికులు బ్యాంకు అధికారులను కోరుతున్నారు. వినియోగదారులు భయాందోళనలకు గురికాకుండా ఏటీఎం కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఎస్బీఐ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..