BCCI Warning to IPL Teams: ఐపీఎల్ 2026 సీజన్ కేవలం సిక్సర్లు, ఫోర్లకే పరిమితం కాకుండా క్రమశిక్షణా ఉల్లంఘనలతో వార్తల్లో నిలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో ఈ-సిగరెట్ (వేపింగ్) ఉపయోగిస్తూ కెమెరాకు చిక్కడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ, కఠిన చర్యలకు సిద్ధమై ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు హెచ్చరికలు జారీ చేసింది.
రియాన్ పరాగ్ వేపింగ్ వివాదం: అసలేం జరిగింది?
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ సందర్భంగా ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో కూర్చుని ‘వేపింగ్’ (ఈ-సిగరెట్) చేస్తూ ప్రత్యక్ష ప్రసార కెమెరా కంటికి దొరికిపోయాడు. భారతదేశంలో ఈ-సిగరెట్లు నిషేధిత వస్తువులు మాత్రమే కాకుండా, మైదాన నియమావళి ప్రకారం స్టేడియం లోపల వీటి వినియోగం నిషిద్ధం.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ప్లేయర్ల క్రమశిక్షణపై ప్రశ్నలు సంధించారు. దీనిపై స్పందించిన బీసీసీఐ, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.21 కింద పరాగ్పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా ఖచ్చితమైన ఆదేశాలు..
ఈ ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందిస్తూ, లీగ్ గౌరవాన్ని కాపాడటం ప్రతి ఆటగాడి బాధ్యత అని గుర్తుచేశారు. “ఆటగాళ్లు, అధికారులు మైదానం లోపల, వెలుపల క్రీడా స్ఫూర్తిని, క్రమశిక్షణను తప్పనిసరిగా పాటించాలి. నిబంధనల ఉల్లంఘనను బోర్డు ఏమాత్రం సహించదు” అని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ప్రస్తుతానికి ఇది బోర్డు పరిధిలోని క్రమశిక్షణా వ్యవహారమని పేర్కొన్నారు.
జట్లపై కూడా వేటు పడే అవకాశం..!
కేవలం ఆటగాళ్లపైనే కాకుండా, క్రమశిక్షణను పర్యవేక్షించని ఫ్రాంచైజీలపై కూడా చర్యలు తీసుకునే దిశగా బీసీసీఐ ఆలోచిస్తోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ కూడా డగౌట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు జరిమానా ఎదుర్కొన్నారు. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజ్మెంట్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే, సదరు ఆటగాళ్లపై నిషేధం (Ban) విధించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు బోర్డు హెచ్చరించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..