గత వారం రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. గోల్డ్ రేట్లు తగ్గుతుండగా.. వెండి రేట్లు మాత్రం పెరుగుతున్నాయి. ఇలా ఈ రెండు లోహాల వద్ద భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1260 తగ్గగా.. వెండి ధర రూ.5 వేలకుపైగా పెరిగింది. ఈ రెండు లోహాల మధ్య ఉన్న డిమాండ్ కారణంగా ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వెండికి ఆభరణంగానే కాకుండా పారిశ్రామిక అవసరాల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్ల ఏర్పాటులో వెండి వినియోగిస్తున్నారు. దీంతో వెండికి పారిశ్రామికంగా డిమాండ్ పెరిగినట్లు చెబుతున్నారు.
పతనమైన బంగారం ధరలు
వారం ప్రారంభంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,070 వద్ద ఉండగా.. మే 2 నాటికి రూ.1,51,810కి పతనమైంది. అంటే వారం రోజుల్లో రూ.1260 తగ్గింది. ఏప్రిల్ 29వ తేదీన ఒకేసారి రూ.1.50 లక్షల మార్క్ కంటే దిగువకు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ స్వల్పంగా పుంజుకుంది. ఇక వెండి ధరలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. బంగారం తగ్గుతుండగా.. వెండి ధరల్లో మాత్రం పెరుగుదల నమోదవుతోంది. గత వారంలో వెండి ధర రూ.5060 పెరిగింది. ఏప్రిల్ 26న కిలో వెండి రూ.2,46,110గా ఉండగా.. మే 2 నాటికి రూ.2,51,170కి పెరిగింది. అయితే ఈ ఏడాది జనవరిలో గోల్డ్, సిల్వర్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1.80 లక్షల వద్ద ఉండగా.. వెండి ధర కిలో రూ.4 లక్షలు దాటింది.
కారణాలు ఇవే..
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై ఆందోళనల క్రమంలో గత వారంలో బంగారం ధరలు 0.81 శాతం తగ్గాయి. అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో పురోగతి లేకపోవడం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోతలపై అంచనాలను తగ్గించడం పసిడిపై ఒత్తిడి పడింది. ఇక ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ బలపడటంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రారంభమైన దగ్గర నుంచి ధరలు 14 శఆతం పడిపోయాయి. ఇక హర్ముజ్ జలసంధి ఆందోళనలు కొనసాగడం, చమురు సరఫరాలో అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల క్రమంలో పసిడి ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతోంది.