పెళ్లి అని బయల్దేరాడు.. మార్గం మధ్యలోనే యముడు పిల్చాడు.. ఈ స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు!

పెళ్లి అని బయల్దేరాడు.. మార్గం మధ్యలోనే యముడు పిల్చాడు.. ఈ స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు!


ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి వేడుకలు కాస్తా విషాదంగా మారాయి. జౌన్‌పూర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం దారుణం జరిగింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు, గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఖేతసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. సంతోషంతో ఊరేగుతున్న బంధువుల కళ్ల ముందే వరుడు రక్తం మడుగులో పడిపోవడంతో ఆ ప్రాంతం అంతా హాహాకారాలతో నిండిపోయింది.

సరాయ్ ఖ్వాజా పోలీస్ స్టేషన్ పరిధిలోని బరౌర్ గ్రామానికి చెందిన రామ్ లఖన్ బింద్ కుమారుడు ఆజాద్ బింద్ (27) వివాహం ఖేతసరాయ్ ప్రాంతానికి చెందిన యువతితో నిశ్చయమైంది. శుక్రవారం సాయంత్రం ఆజాద్ తన పెళ్లి ఊరేగింపుతో బయలుదేరాడు. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఊరేగింపు బీబీపూర్ గ్రామం సమీపానికి చేరుకుంది.

మరికొద్ది సేపట్లో పెళ్లి మండపానికి చేరుకోవాల్సి ఉండగా, మోటార్ సైకిల్‌పై ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు వేగంగా వచ్చి వరుడి కారును ఓవర్‌టేక్ చేశారు. కారు ఆగిన వెంటనే, నిందితులు ఒక్కసారిగా తుపాకులతో ఆజాద్‌పై కాల్పులు జరిపారు. తూటాలు వరుడి శరీరంలోకి దూసుకుపోవడంతో ఆజాద్ తీవ్ర రక్తస్రావంతో కారులోనే కుప్పకూలిపోయాడు. కాల్పుల శబ్దం విన్న బంధువులు, స్నేహితులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.

తీవ్రంగా గాయపడిన ఆజాద్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పెళ్లి ముచ్చట తీరకుండానే కుమారుడు శవమై పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. మృతుడి గ్రామంలోనూ, పెళ్లికూతురి ఇంట్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలను గుర్తించారు. ఎస్‌ఎస్‌పి అనుపమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హత్య వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నట్లు తేలింది. పెళ్లికూతురి బంధువైన ప్రదీప్ బింద్ ఈ పెళ్లి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ప్రదీప్ తన స్నేహితుడు రవి యాదవ్‌తో కలిసి ఈ హత్యకు స్కెచ్ వేశాడు. ఆజాద్‌తో వివాహం జరగడం ఇష్టం లేకనే, ఊరేగింపుపై దాడి చేసి వరుడిని మట్టుబెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి ఆయుష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రస్తుతం బీబీపూర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒక శుభకార్యం ఇలా రక్తం చిందిన ఘటనగా మారడం స్థానికంగా కలకలం రేపుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *