ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. కొంత మంది సూర్యుడి భగ భగలకు ఇంటి నుంచి బయట కాలు పెట్టడానికి వణికిపోతున్నారు. కానీ ఇటు ఎండలు కొడుతుంటే ఒక జిల్లాలో మాత్రం అకాల వర్షం రైతులను ఆగం చేసింది. భారీ వర్షానికి చేతి కొచ్చిన పంట నీటి పాలైంది. మార్కాపురం జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. అరటి, బొప్పాయి పంటలకు అపార నష్టం వాటిల్లింది.
మార్కాపురం జిల్లాలో అకాల వర్షం దంచికొట్టింది. కురిసింది కొద్దిసేపే అయినా భారీ ఈదురు గాలులు, వడగండ్ల వాన ధాటికి జనం బెంబేలెత్తారు. బేస్తవారి పేట మండలం గంటా పురం గ్రామంలో పిడుగుపాటుకు రైతు కూలీ గంట శోభరాణి (40) మృతి చెందింది. పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై శోభ రాణి అక్కడికక్కడే చనిపోయింది. మార్కాపురం మండలం బోడపాడులో పిడుగుపాటుకు ఒంటేరు పుల్లమ్మ (47) మృతి చెందింది. బోడపాడులో కోళ్ల ఫారం దగ్గర పిడుగుపాటుకు షెడ్డుఎగిరి పడి చింతకుంట్ల కుమారి (50) చనిపోయింది.
పంటలకు అపార నష్టం. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో అకాల వర్షాలు అరటి రైతులను నిండా ముంచాయి. బురుజుపల్లి, ఉప్పలపాడు ముండ్లపాడు, క్రిష్టంశెట్టి పల్లి, కంభం మండలం పోరుమామిళ్ల పల్లి గ్రామాలలో 130 ఎకరాలలో అరటి పంట వేసిన రైతులు నష్టపోయారు.
ఎకరాకు లక్షల వరకు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్షం తమ ఆశలపై నీళ్లు చల్లిందని రైతులు వాపోయారు. గత నాలుగు సంవత్సరాలుగా తమకు ఇదే పరిస్థితి ఏర్పడిందని గతంలో కూడా ప్రభుత్వం తమని ఆదుకున్న దాఖలు లేవని తెలిపారు. ఈ సంవత్సరమైనా అరటి రైతులను ఆదుకొని నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
మార్కాపురం, బేస్తవార పేట, దోర్నాల, అర్ధవీడు, గిద్దలూరు, కంభం, పెదచెర్లోపల్లి, పామూరు మండలాల్లో కోత దశలో ఉన్న అరటి, బొప్పాయి తోటలు వర్షం దెబ్బకు నేల కూలాయి. కల్లాలో ఉన్న మిరప, ఇతర పంట ఉత్పత్తులు తడిచిపోయి పనికి రాకుండా పోయాయి. పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.




