Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏయే రాష్ట్రాల్లో ఎవరిది ఆధిపత్యం అంటే…

Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏయే రాష్ట్రాల్లో ఎవరిది ఆధిపత్యం అంటే…


తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు దేశంలో ప్రధానపార్టీలకు అత్యంత కీలకం. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌, బీజేపీలకే కాదు.. దేశ రాజకీయాలను శాసిస్తున్న ప్రాంతీయపార్టీలు TMC, DMK, లెఫ్ట్ పార్టీల భవితవ్యం కూడా వీటిపై ఆధారపడి ఉన్నాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, కులగణన, SIR వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారాయి. అదే సయయంలో ఉత్తర, దక్షణ భారత నినాదాలు కూడా తెరమీదకు వచ్చాయి.

పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి, టిఎంసీకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అక్కడ ఎవరు గెలుస్తారన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోంది. వరుసగా నాలుగోసారి గెలుపు లక్ష్యంగా మమత బెనర్జీ సర్వశక్తులూ ఒడ్డారు.. ఒక్కో అడుగు వేసుకుంటూ ప్రధాన ప్రత్యర్థిగా మారిన బీజేపీ విజయాన్ని నరేంద్రమోదీ, అమిత్‌షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హ్యాట్రిక్‌ విజయాలతో దూకుడుమీద ఉన్న టీఎంసీకి బ్రేకులు వేస్తుందా?

అటు తమిళనాడు ఎన్నిక కూడా అత్యంత కీలకం. సౌత్‌ఇండియాలో అతిపెద్ద రాజకీయశక్తుల్లో ఒక్కటైన DMK వరసగా రెండోవిజయం కోసం తహతహలాడుతోంది. జయలలిత మరణం తర్వాత బీజేపీతో జతకట్టిన AIDMK కూడా విజయంపై ధీమాగా ఉంది. వీరి మధ్య పోటీలో నటుడు విజయ్‌ సారథ్యంలోని TVK ప్రధానశక్తిగా అవతరించారు. ఆయన కింగ్‌ అవుతారా? కింగ్‌ మేకర్‌ అవుతారా అంటూ చర్చలు మొదలయ్యాయి.

ఇక కేరళంలో హ్యాట్రిక్‌ విజయంపై లెఫ్ట్‌ ఫ్రంట్ ఆశలుపెట్టుకుంది. అయితే కాంగ్రెస్‌ నేతృత్వంలోని UDF బలంగా ఉంది. వారి మధ్య పోటీ నువ్వా- నేనా అన్నట్టుగా ఉంది. ఇక అసోంలో హిమంత మరోసారి సీఎం కావాలన్న లక్ష్యంతో ఊరూవాడా ప్రచారం చేశారు. హిందుత్వ అజెండాగా బలంగా జనాల్లోకి తీసుకెళ్లారు. అటు ప్రత్యర్ధి పార్టీలు కూడా తమదైన మతపరమైన అస్త్రాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో NR కాంగ్రెస్‌ విజయంపై ధీగా ఉండగా.. కాంగ్రెస్‌ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. కొత్తగా రంగంలో దిగిన విజయ్‌ పార్టీ TVKప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది.

కేరళలో యూడీఎఫ్ సర్కార్ అని అంచనా వేసిన పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్

కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.  కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్‌డీఎఫ్ కూటమికి ఈ సారి  భంగపాటు తప్పదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమని సర్వేలో వెల్లడైంది.  140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజార్టీకి 71 సీట్లలో గెలవాలి. కేరళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 75-85, ఎల్‌డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్ కంటే 2 శాతం ఆధిక్యత కనబరుస్తుందని సర్వేలో వెల్లడైంది.  ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పనితీరుపై సర్వేలో 55.1 శాతం సంతృప్తి వ్యక్తం చేసినా ఎల్‌డీఎఫ్‌కు మళ్లీ అధికారం కట్టబెట్టకపోవడం ఇక్కడ విశేషం. ఎల్‌డీఎఫ్‌కు మరోసారి అవకాశం ఇవ్వమని 42 శాతం చెప్పారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినయర్ విజయన్‌కు 22.3 శాతం మద్దతివ్వగా, కాంగ్రెస్ నేత సతీషన్‌కు 14.5 శాతం మద్దతిచ్చారు.  ఎన్నికల్లో పార్టీకి ప్రాధన్యతిచ్చామని 51.8 శాతం చెప్పగా, 33.1 శాతం మంది అభ్యర్థులను బట్టి ఓటు వేశామని చెప్పారు. కేరళలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. రాష్ట్రంలో  ఎన్డీఏ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగలేదని సర్వేలో వెల్లడైంది. 59.4 శాతం మంది రాష్ట్రంలో మూడు ఫ్రంట్ అవసరం లేదని సర్వేలో చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై 50.9 శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రచారంపై కేరళలో ఆసక్తి కనిపించలేదు.  ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ముఖాముఖి పోటీ జరిగిన కేరళలో పదేళ్ల వామపక్ష ప్రభుత్వానికి ప్రజలు బ్రేకులు వేసినట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.

అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ…

అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలెయెన్స్ (ఎన్‌ఈడీఏ) వరుసగా మూడోసారి అధికారంలోకి రానుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎన్‌ఈడీఏగా పిలువబడుతుంది.  అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి 64 స్థానాలు కావాలి.  2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 68-72 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 22-26 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ఎన్‌ఈడీఏ కూటమిలో బీజేపీ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ) 7-10, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 8-9 స్థానాల్లో గెలిచే అవకాశాలుండడంతో ఎన్డీఏ కూటమి 90 స్థానాలకు చేరుకోవచ్చు. బీజేపీ 38.6 శాతం, కాంగ్రెస్ 36.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. అస్సాం ఎన్నికల్లో ఇతర పార్టీలైన ఏఐయూడీఎఫ్, రాయిజర్ దాల్, యూపీపీఎల్, ఏజేపీ, సీపీఐ(ఎం), ఇతరుల ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వానికి 45 శాతం మద్దతిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగాయ్‌కు 35 శాతం మద్దతిస్తున్నారు.  అప్పర్ అస్సాంలో ఎన్డీఏ పటిష్టంగా ఉంది. మధ్య అస్సాంలోని నాగావ్, హూజాయ్, కర్బి అంగలాంగ్, దిమా హసావ్, దారంగ్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ కనిపించింది. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న లోయర్ అస్సాంలో ఏఐయూడీఎఫ్ గతంలో పోలిస్తే కొంత బలోపేతమయినా ఇక్కడ ఎన్డీఏ ఆధిపత్యం కనిపిస్తోంది.

తమిళనాడులో మ‌రోసారి డీఎంకే…

తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదయ్యింది. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యింది.

తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది.

అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది.

తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేప‌ట్ట‌నుంద‌ని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి.

డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది. మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా, పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చారు.  18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది. డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది.

ప్రధాన అభ్య‌ర్థుల‌ స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతున్నారు.  మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది. డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది.

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై మైలాపూర్‌లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది.

సినీ నటడు దివంగత విజయ్‌కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్‌కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.  తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి. టీవీకే, పీఎమ్‌కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోంది. ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్‌కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్‌లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది. ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్‌కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది.

విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు.  డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు.

పుదిచ్చేరిలో మ‌ళ్లీ ఏన్‌డీఏనే… కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు కావాలి. మరో మూడు నామినేటెడ్ స్థానాలున్నాయి.

పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 16-19 స్థానాలు, సెక్యూలర్ ప్రొగ్రెసివ్ (ఎస్‌పీఏ) కూటమి 10-12 స్థానాలు, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తెలింది.  2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 34 నుండి 36 శాతం, ఎస్‌పీఏ కూటమి 30 నుండి 32 శాతం, టీవీకే, ఎన్ఎమ్‌కే కూటమి 15 నుండి 17 శాతం, ఎన్‌టీకే 4 నుండి 6 శాతం, వీసీకే 1 నుండి 3 శాతం, ఇతరులు 2 నుండి 5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమిలోని ఏఐఎన్ఆర్‌సి పార్టీ 10-12 సీట్లతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలవనుంది. ఎన్డీఏలోని బీజేపీ 5-6 స్థానాలు, ఎల్‌జేకే 1-2, ఏఐఏడీఎమ్‌కే 0-1 స్థానాలు గెలవొచ్చు. ఎస్‌పీఏ కూటమిలోని డీఎమ్‌కే 6-8, కాంగ్రెస్ 1-3 స్థానాలు, టీవీకే, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది.

పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఆ కూటమి విజయానికి దోహదం చేస్తున్నాయి. పుదిచ్చేరిలో దాదాపు 68 శాతం మంది ముఖ్యమంత్రిగా ఎన్.రామస్వామికి మద్దతిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశమిస్తామని దాదాపు 60 శాతం చెప్పగా, 36 శాతం మరోసారి అవకాశమివ్వమని చెప్పారు.  పుదిచ్చేరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అవసరమని దాదాపు 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. పుదిచ్చేరిలో అభివృద్ధికి సంబంధించి 56 శాతం మంది ఏఐఎనఆర్‌సికి మద్దతివ్వగా, 24 శాతం మంది కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *