తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట గురించి తెలియని వారుండరు. వీరి ప్రేమ, కుటుంబ కలహాలు, సోషల్ మీడియా రీల్స్ ఒకప్పుడు ఒక డెయిలీ సీరియల్ను తలపించాయి. వివాదాలతో వార్తల్లో నిలిచిన మాధురి, బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. నెగెటివిటీతో లోపలికి వెళ్లినా, బయటకు వచ్చేటప్పుడు మాత్రం ప్రేక్షకుల నుంచి కొంత పాజిటివ్ మార్కులే సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ లేడీ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.
వైరల్ టైటిల్తో సినీ ఎంట్రీ
మాధురి నటిగా పరిచయమవుతున్న చిత్రానికి చీన్ టపాక్ డుం డుం అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఈ డైలాగ్నే టైటిల్గా పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో ఆమె కేవలం ఏదో ఒక చిన్న పాత్రలో కాకుండా గైరమ్మత్త అనే అత్యంత పవర్ఫుల్, గంభీరమైన పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో మాధురి లుక్ చూస్తుంటే సినిమాలో ఆమె పాత్రే మేజర్ హైలైట్ కానుందని స్పష్టమవుతోంది. శుభం ఫేమ్ గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, బ్రిగిడా సాగా హీరోయిన్గా నటిస్తోంది. వైఎన్ లోహిత్ దర్శకత్వంలో విలేజ్ టాకీస్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది. మూవీ ఓపెనింగ్కు గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, వశిష్ఠ వంటి ప్రముఖులు హాజరై యూనిట్కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ మూవీని ఆగస్టు నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
రాజకీయాల నుండి వెండితెర వరకు..
నిజానికి మాధురి ఒక క్లాసికల్ డాన్సర్. రాజకీయాలపై ఆసక్తితో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పొలిటికల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ దువ్వాడ శ్రీనివాస్కు దగ్గరయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి హైదరాబాద్లో వకుళ సిల్క్స్ పేరుతో వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇదే క్రమంలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బుల్లితెరపై మెరిసిన ఆమె.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటాలని భావిస్తున్నారు.
షూటింగ్, విడుదల
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నర్సీపట్నం, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది ఆగస్టు నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. వివాదాలను పక్కన పెట్టి, నటిగా మాధురి ఏ మేరకు రాణిస్తుందో చూడాలి మరి. 1