భారతదేశంలో ప్రజల రవాణా వ్యవస్థలో రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. సామాన్యుల నుంచి ధనికుల వరకు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో రైళ్లు ప్రధాన సాధనం. ఈ భారీ వ్యవస్థను సజావుగా నడిపించడంలో లోకో పైలట్ల (రైలు డ్రైవర్లు) పాత్ర అత్యంత కీలకం. అయితే ఈ బాధ్యతాయుతమైన ఉద్యోగానికి వారికి ఎంత జీతం లభిస్తుందనే విషయం చాలామందికి ఆసక్తికరమే. రైల్వేలో డ్రైవర్ కెరీర్ సాధారణంగా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా ప్రారంభమవుతుంది. ప్రారంభ బేసిక్ జీతం సుమారు రూ.19,900 ఉంటుంది. వివిధ అలవెన్సులు కలుపుకుని నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఆదాయం పొందుతారు. అనుభవం పెరుగుతూ, ప్రమోషన్లు పొందిన కొద్దీ సీనియర్ లోకో పైలట్, చీఫ్ లోకో పైలట్ స్థాయిలకు చేరుకుని జీతం కూడా గణనీయంగా పెరుగుతుంది.
అత్యంత ప్రాధాన్యత గల రైళ్లైన రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్లను నడిపే లోకో పైలట్లకు అధిక అనుభవం అవసరం. వీరికి అదనపు అలవెన్సులు, దూరాన్ని బట్టి చెల్లింపులు కూడా లభిస్తాయి. సాధారణంగా వీరి నెల జీతం రూ.35,000 నుంచి రూ.55,000 మధ్య ఉంటుంది. సీనియారిటీ ఆధారంగా ఈ మొత్తం మారుతుంది. ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన ఆధునిక రైళ్లలో వందే భారత్ ప్రత్యేక స్థానం సంపాదించింది. అధునాతన సాంకేతికతతో అధిక వేగంతో నడిచే ఈ రైళ్లను నడిపే లోకో పైలట్లకు ఎక్కువ అనుభవం, నైపుణ్యం అవసరం.
అందుకే వీరి జీతం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ వందే భారత్ రైళ్ల డ్రైవర్లు నెలకు రూ.70,000 నుంచి రూ.1.1 లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంది. మొత్తానికి రైల్వే డ్రైవర్లలో అత్యధికంగా సంపాదించేవారు వందే భారత్ లోకో పైలట్లే. ఆ తరువాత రాజధాని, శతాబ్ది డ్రైవర్లు ఉంటారు. అనుభవం, రూట్లు, బాధ్యతల ఆధారంగా జీతాల్లో తేడాలు కనిపిస్తాయి. భారీ బాధ్యతల మధ్య ఈ ఉద్యోగం గౌరవప్రదమైనదిగా కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి