ఒంగోలు నగర సమీపంలోని చదలవాడ దగ్గర సుమారు 100 కోట్ల అంచనా వ్యయంతో 148 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి రవి ప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ ముందుకొచ్చింది. గతనెల మార్చి 28న నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఒంగోలులో అన్ని హంగులతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు అనుమతి లభించింది.
ఇందుకోసం 2024-29 సంవత్సరం కింద పలు రాయితీలు ఇచ్చేందుకు ఇటీవల సమావేశమైన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు ఎపిలో వైజాగ్ తరువాత ఒంగోలులో నిర్మించనున్న ఈ ఫైవ్స్టార్ హోటల్ ద్వారా పర్యాటక రంగం అభివృద్ది చెందడమే కాకుండా ప్రత్యక్షంగా 300 మందికి ఉపాధి కల్పించనున్నట్లు రవి ప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ నిర్వాహకుడు కంది రవిశంకర్ తెలిపారు
ఇప్పటికే నిర్మాణ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రవి ప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ తాజాగా ఒంగోలు నగర సమీపంలోని చదలవాడలోని చాతుర్వాటికలో 100 కోట్ల నిర్మాణ వ్యయంతో 148 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనుంది. అందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ హోటల్ నిర్మాణానికి మూలనిధి పెట్టుబడి, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ ఛార్జీలు వంటి అంశాల్లో ప్రోత్సాహకాలు అందించనున్నారు. రాడిసన్ సంస్థ భాగస్వామ్మయంతో ఫైవ్స్టార్ హోటల్ నిర్మించనున్న రవి ప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ చైర్మన్ కంది రవిశంకర్ ప్రకాశంజిల్లా కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అనంతరం రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవి శంకర్ను కలెక్టర్ సన్మానించారు.ఈ సందర్భంగా ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయ్కుమార్లు కంది రవిశంకర్ను అభినందించారు.




