హైదరాబాద్ నగరంలో మరోసారి గోల్డ్ మ్యాన్ల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. సోషల్ మీడియాలో మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు నేరుగా దాడుల వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఓల్డ్ సిటీకి చెందిన సూర్య భాయ్, మరోవైపు దర్గా చిన్న పహిల్వాన్ మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు తలెత్తుతున్నాయి. ఇద్దరూ తమదే అసలైనదని, నీది ఫేక్ అంటే నీది ఫేక్ అంటూ విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. సూర్య భాయ్ ధరించే బంగారం ఫేక్ అని ఐటీ అధికారులు నిర్ధారించినట్లు వార్తలు రావడం ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు.
ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చిన్న పహిల్వాన్ అనుచరులు సూర్య భాయ్ నివాసానికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. దాడికి గల కారణాలు, ఇందులో పాల్గొన్న వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సోషల్ మీడియాలో మొదలైన ఈ వివాదం రోడ్లపైకి రావడం పట్ల పోలీసులు సీరియస్గా ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా, గోల్డ్ మ్యాన్ ల మధ్య ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు హింసాత్మకంగా మారి నగరంలో కలకలం రేపుతోంది. అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.