“ఒక్కసారి భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్కృతిని చూడండి”.. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌కు మద్దతుగా ఇరాన్

“ఒక్కసారి భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్కృతిని చూడండి”.. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌కు మద్దతుగా ఇరాన్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనాలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్‌లో, భారత్‌ను “నరక కూపం”గా అభివర్ణించడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. భారతీయులకు ఇంగ్లీష్ రాదని, అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇచ్చే పౌరసత్వ చట్టం వల్ల సమస్యలు వస్తున్నాయని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై ముంబైలోని ఇరాన్ రాయబార కార్యాలయం అనూహ్య రీతిలో స్పందించింది. ట్రంప్‌కు చురకలు అంటిస్తూ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. “ట్రంప్‌ను బహుశా సాంస్కృతిక శుద్ధికి పంపాలి. అప్పుడైనా ఆయన అనవసరమైన వాగుడు తగ్గుతుంది. ఒక్కసారి భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్కృతిని చూడండి, అప్పుడు మాట్లాడండి” అని పేర్కొంటూ మహారాష్ట్రలోని పర్యాటక ప్రాంతాల ఫోటోలను షేర్ చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి వాస్తవ విరుద్ధమైనవని, రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాన్ని ఇటువంటి వ్యాఖ్యలు దెబ్బతీస్తాయని భారత ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, వివాదం ముదరడంతో, అమెరికా రాయబార కార్యాలయం నష్టనివారణ చర్యలు చేపట్టింది. భారత ప్రధాని తనకు మంచి మిత్రుడని, భారతదేశం ఒక గొప్ప దేశమని ట్రంప్ గతంలో అన్నారని గుర్తు చేస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసింది.

ఇదిలావుంటే, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్న తరుణంలో ఈ వివాదం తలెత్తడం చర్చనీయాంశమైంది. చైనాను అడ్డుకోవడంలో భారత్‌ను కీలక భాగస్వామిగా భావించే అమెరికా, ఇటువంటి వ్యాఖ్యల వల్ల తలెత్తిన ఇబ్బందికర పరిస్థితులను ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ, అగ్రరాజ్య అధినేత నోటి వెంట వచ్చిన ఇటువంటి మాటలు భారతీయ సమాజంలో అసహనాన్ని కలిగించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *