యువతకు ఉద్యోగాలకు ముందే ప్రాక్టికల్ అనుభవం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులతో పథకం మరింత ఆకర్షణీయంగా మారగా, విద్యార్థులకు పెద్ద ఎత్తున అవకాశాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తాజా సవరణల ప్రకారం ఈ పథకం కింద ఇంటర్న్షిప్ చేస్తున్న అభ్యర్థులకు ఇచ్చే నెలవారీ స్టైపెండ్ను రూ.5,000 నుండి రూ.9,000కు పెంచారు. ఇందులో 90 శాతం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అదనంగా ఇంటర్న్లకు రెండు విడతల్లో రూ.6,000 ఆర్థిక సహాయం కూడా అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యార్థులు ఇంటర్న్షిప్లపై దృష్టి పెట్టే అవకాశం లభించనుంది.
అర్హతా నిబంధనలలో కూడా గణనీయమైన మార్పులు చేశారు. గతంలో 21–24 సంవత్సరాల మధ్య వయస్సు గలవారికే పరిమితమైన ఈ పథకం, ఇప్పుడు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతకు విస్తరించబడింది. ముఖ్యంగా చివరి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను కూడా చేర్చడం ఒక కీలక నిర్ణయంగా మారింది. అయితే చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, విద్యార్థులు తమ కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి NOC సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులు చదువుకుంటూనే పరిశ్రమలలో పని చేసే అవకాశం పొందుతారు. దీని వల్ల సైద్ధాంతిక జ్ఞానం మాత్రమే కాకుండా, ప్రాక్టికల్ అనుభవం కూడా పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించబడింది. అనుభవపూర్వక అభ్యాసానికి ప్రాధాన్యత ఇస్తూ, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCలు), పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్ వంటి భవిష్యత్ రంగాల్లో కూడా అవకాశాలను కల్పిస్తోంది. మొత్తంగా ఈ మార్పులు యువతను ఉద్యోగ మార్కెట్కు మరింత సిద్ధంగా మార్చడమే కాకుండా, విద్య నుంచి ఉపాధి వరకు ఉండే గ్యాప్ను తగ్గించే దిశగా కీలక అడుగుగా భావించబడుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి