IPL 2026 Final Venue: ఐపీఎల్ 2026 ఫైనల్ వేదిక ఫిక్స్.. గుట్టు విప్పిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్..!

IPL 2026 Final Venue: ఐపీఎల్ 2026 ఫైనల్ వేదిక ఫిక్స్.. గుట్టు విప్పిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్..!


IPL 2026 Final Venue: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందనే ఉత్కంఠకు దాదాపు తెరపడింది. ఫైనల్ మ్యాచ్ వేదిక గురించి అధికారిక ప్రకటన రాకముందే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. ఈ ఏడాది జరిగే ప్రతిష్టాత్మక టైటిల్ పోరుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అతడు స్పష్టం చేశాడు.

ఫైనల్ వేదికపై పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేసిన విషయం క్రీడాభిమానులకు తెలిసిందే. అయితే, ప్లేఆఫ్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, శనివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ చేసిన వ్యాఖ్యలు ఫైనల్ వేదికపై పూర్తి స్పష్టతనిచ్చాయి. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ ఐకానిక్ గ్రీన్ జెర్సీ ధరించి టాస్ కోసం వచ్చిన పాటిదార్ మాట్లాడుతూ.. “చిన్నస్వామి స్టేడియాన్ని మాకు ఎవరూ బద్దలు కొట్టలేని కోటగా మార్చేందుకు చాలా ప్రణాళికలు రచించాం. ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్ ఇక్కడే జరగనుందని మాకు ముందే తెలుసు. అందుకే మా సొంత మైదానంలో జరిగే అన్ని మ్యాచ్‌లలో తప్పక గెలవాలని బరిలోకి దిగుతున్నాం” అని ఎంతో ధీమాగా చెప్పాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. తమ సొంత అభిమానుల మధ్య టైటిల్‌ను కాపాడుకునే అద్భుతమైన అవకాశం దక్కించుకోనుంది.

సొంతగడ్డపై అదరగొడుతున్న బెంగళూరు జట్టు..

రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆడుతున్న ఆర్సీబీ ఈ సీజన్‌లో అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు వారు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఏకంగా నాలుగు అద్భుత విజయాలు నమోదు చేసి తమ సత్తా చాటింది. ఇందులో ముఖ్యంగా మూడు విజయాలు తమ సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలోనే రావడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి అత్యంత బలమైన జట్లపై ఆర్సీబీ ఘన విజయాలు సాధించింది. ఆటగాళ్లంతా సమష్టిగా రాణిస్తుండటంతో తమ హోమ్ గ్రౌండ్‌లో విజయపరంపరను కొనసాగిస్తామని పాటిదార్ గట్టి నమ్మకంతో ఉన్నాడు.

రాయ్‌పూర్‌లోనూ బెంగళూరు హోమ్ మ్యాచ్‌లు..

ప్రస్తుత లీగ్ దశలో ఆర్సీబీకి చిన్నస్వామి స్టేడియంలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్, కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతో ఆర్సీబీ తలపడనుంది. ఆ తర్వాత తమ ఖాతాలో ఉన్న మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లను ఆర్సీబీ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. రాయ్‌పూర్ వేదికగా పటిష్టమైన ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లతో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. మొత్తానికి పాటిదార్ చేసిన తాజా వ్యాఖ్యలతో ఫైనల్ వేదికపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయడం ఇక లాంఛనమే అని క్రీడా విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *