
అది గిరిజన వ్యవసాయ కూలీ రైతు కుటుంబం.. రెక్కడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది.. ఇద్దరు పిల్లలు.. ఒకరు పదేళ్లు, మరొకరు నెలల పసికందు. దీంతో కూడు తినాలంటే ఖచ్చితంగా పనికి వెళ్లాల్సిందే. మండుతున్న ఎండల్లో పసి పిల్లలతో పనులకు వెళ్లాలంటే భయపడిన ఆ కుటుంబం.. ఇంటి వద్ద నెలల పసికందును చిన్నారికి అప్పగించి వెళ్లారు. తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకోమ్మా.. వెళ్లి వచ్చేస్తాం అని బయలుదేరారు తల్లిదండ్రులు. ఆ పసికందును లాలించింది ఆ చిట్టితల్లి. తమ్ముడు పడుకున్న తర్వాత.. ఆమె ఊయల ఊగేందుకు ప్రయత్నించింది.. ఇంతలోనే ఊహించని ఘోరం జరిగింది.
అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం కొదోంజొల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో లొకిరాం.. తన భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఆ గిరిజన దంపతులకు పదేళ్ల మాధవి, మరో మూడు నెలల పసికందు ఉన్నారు. తల్లి.. మూడు నెలల పసికందును చిన్నారి చేతిలో పెట్టి లాలించాలని గెడ్డకు వెళ్లింది. తండ్రి కూడా పనుల కోసం వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తమ్ముడిని లాలించిన ఆ చిట్టి తల్లి.. పసికందు నిద్రబుచ్చిన తరువాత పక్కనే వేసింది. ఆ తరువాత సరదాగా ఊయల వైపు వెళ్లి ఊగుతూ ఉంది మాధవి. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఊయల మాధవి మెడకు బిగించుకుని ఊపిరి వదిలేసింది. ఇంటికి తల్లిదండ్రులు వచ్చే చూసేసరికి.. మాధవి విగతజీవిగా పడి ఉంది. ప్రమాదవశాత్తు ఇరుక్కపోయి మృతి చెందిందని చిన్నారి తండ్రి లొకిరాం బోరున విలపించాడు. గ్రామంలో ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో చిన్నారిని కాపాడలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు అంటున్నారు. చిన్నారి మాధవి.. కొసొంగుడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది. మాధవి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.