ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కొలువైన ఉన్న భ్రమరాంబికా దేవి అమ్మవారిని కర్ణాటక వాసులు తమ ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. ప్రతియేటా ఉగాది ఉత్సవాల నాటికి తమ ఇంటి ఆడపడుచుకు చీర, సారెలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా చీరె, సారెలతో కర్నాటకకు చెందిన భక్తులు నల్లమల అటవీప్రాంతంలో పాదయాత్ర చేసుకుంటూ పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
అమ్మవారికి పుట్టింటి సారె…
శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున సమేత శ్రీ భ్రమరాంబికా దేవికి ఏటా ఉగాది ఉత్సవాలకు పుట్టింటి నుంచి సారె తీసుకురావడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అమ్మవారి పుట్టిల్లుగా భావించే కర్ణాటక నుంచి భక్తులు సారె తీసుకొస్తున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు, ఒడి బియ్యాన్ని అమ్మవారికి సారెగా సమర్పిస్తారు. ఇందుకోసం కర్నాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు నల్లమల అడవిని దాటుకుంటూ పాదయాత్రగా తరలివస్తున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కన్నడ భక్తులతో నల్లమల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న భక్తులు చేస్తున్న శివన్నామస్మరణతో అటవీప్రాంతం మార్మోగిపోతోంది. ఉగాది పర్వదినానికి ముందే కర్నాటక భక్తులు శ్రీశైలానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు.
కాళ్ళకు కర్రలు కట్టుకుని పాదయాత్ర…
కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. ఉగాదికి ముందు గానే తమ సొంత ప్రాంతాల నుంచి బయలుదేరి ఉగాది పండగకు ముందు శ్రీశైలం చేరుకుంటారు. కొంతమంది యువకులు కాళ్ళకు పొడవాటి కర్రలు కట్టుకుని పాదయాత్ర చేయడం విశేషం.
భక్తుల పాదయాత్ర నల్లమలలోని దట్టమైన అటవీప్రాంతం నుంచి కొనసాగుతుండటంతో అటవీశాఖ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒంటరిగా పాదయాత్ర చేయవద్దని, గుంపుగుంపులుగా పాదయాత్ర చేయాలని సూచిస్తున్నారు. అడవిలో వన్యమృగాల దాడులు నివారించేందుకు చేతిలో కర్రలు ధరించాలని సూచిస్తున్నారు. మరోవైపు, ఉగాదికి పది రోజుల ముందునుంచే శ్రీశైలం క్షేత్రానికి భక్తుల తాకిడి మొదలైంది.




