
యాదాద్రి జిల్లా మోత్కూర్కు చెందిన కూరేళ్ల ఎల్లయ్య.. గుండాల మండలం వస్తాకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎల్లయ్యకు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కూతురు ఇంటర్మీడియట్ చదువుతుండగా, పెద్దకొడుకు టెన్త్ క్లాస్, చిన్న కొడుకు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనేది ఎల్లయ్య ఆశయం. టెన్షన్ లేకుండా పదవ తరగతి పరీక్షలు రాసేందుకు కొడుకు హర్షవర్ధన్కు తండ్రి ఎల్లయ్య సూచనలు చేశాడు. రాత్రి పడుకునే సమయంలో ఎల్లయ్యకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో స్థానికంగా వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఎల్లయ్య గుండెపోటుతో విగత జీవిగా మారిపోయాడు. రాత్రి నుంచి ఏడుపులతో ఆ ఇంట విషాదం నెలకుంది. తెల్లవారితే పదవ తరగతి పరీక్షలు.. రాత్రంతా హర్షవర్ధన్కు నిద్రలేని రాత్రిగా మారింది.
ఒకవైపు కళ్లముందే విగతజీవిగా పడి ఉన్న కన్నతండ్రి.. మరోవైపు తన భవిష్యత్తును నిర్ణయించే పదవ తరగతి పరీక్షలు. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఆ విద్యార్థి వేదన వర్ణనాతీతం. తండ్రి మరణంతో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ.. బాధను దిగమింగుకొని పుట్టెడు దుఃఖంతో విద్యార్థి హర్షవర్ధన్ పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షా హాల్లో ప్రశ్నపత్రం ముందు ఉన్నా, అతడి మనసంతా నాన్న జ్ఞాపకాలతోనే నిండిపోయింది. కన్నీటి పర్యంతమవుతూనే పరీక్ష రాస్తున్న ఆ బాలుడిని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం చలించిపోయారు. తండ్రికి ఇచ్చే నిజమైన నివాళి ఆయన ఆశయాన్ని నెరవేర్చడమేనని నిరూపించిన హర్షవర్ధన్ ధైర్యం అందరినీ ఓ పాఠంగా నిలిచింది. తెలుగు పరీక్ష అనంతరం హర్షవర్ధన్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు.
ప్రాణప్రదమైన తండ్రి మరణం వంటి బాధను ఎదుర్కొని అతడు రాసిన ఈ పరీక్ష, కేవలం మార్కుల కోసం కాదు.. ఒక తండ్రి కల కోసం అని, ఆ విద్యార్ధికి భగవంతుడు ధైర్యాన్నివ్వాలని అందరూ కోరుకున్నారు.
Also Read: గుడ్ న్యూస్.. Hi అని మెసేజ్ పెట్టగానే ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ.. భారీ క్యూలైన్లకు చెక్