
మన శరీరం ఒక అంతర్గత గడియారం (Circadian Rhythm) ప్రకారం పనిచేస్తుంది. రాత్రి వేళ జీవక్రియ మందగించినప్పుడు ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాకుండా, గుండెపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ముఖేష్ గోయల్ విశ్లేషణ ప్రకారం.. ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో జరిగే ఆ భయంకరమైన మార్పులు ఏంటి? కేవలం భోజన సమయాన్ని మార్చడం ద్వారా గుండె జబ్బులను ఎలా అరికట్టవచ్చో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం..
1. బాడీ క్లాక్ వర్సెస్ డిన్నర్:
మన జీర్ణ వ్యవస్థ పగటిపూట చురుగ్గా ఉండి, రాత్రివేళ విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతుంది. పడుకునే ముందు తింటే, శరీరం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో జీర్ణక్రియ కోసం కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర, కొవ్వు సరిగ్గా ప్రాసెస్ కావు.
2. గుండెపై ప్రభావం:
పడుకునే ముందు తినడం వల్ల హార్ట్ రేట్ మరియు రక్తపోటు పెరుగుతాయని డాక్టర్ గోయల్ హెచ్చరిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో గుండెపోటు వంటి తీవ్రమైన కార్డియోవాస్కులర్ సమస్యలకు దారితీస్తుంది.
3. నిద్ర నాణ్యత, ఎసిడిటీ:
తిన్న వెంటనే పడుకోవడం వల్ల కడుపులోని యాసిడ్ వెనక్కి తన్ని, గుండెలో మంట మరియు అసౌకర్యానికి దారితీస్తుంది. ఫలితంగా గాఢనిద్ర కరువై, అది ఒత్తిడికి, ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతుంది.
4. బరువు పెరగడం:
NIH పరిశోధనల ప్రకారం, ఆలస్యంగా తినడం వల్ల ఆకలిని ప్రేరేపించే హార్మోన్లు పెరిగి, క్యాలరీలను ఖర్చు చేసే సామర్థ్యం తగ్గుతుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది.
5. మీరు చేయాల్సిన చిన్న మార్పులు:
రాత్రి 7 లేదా 8 గంటల లోపు భోజనం ముగించడానికి ప్రయత్నించండి.
రాత్రి భోజనం తేలికగా ఉండేలా (కూరగాయలు, లీన్ ప్రోటీన్) చూసుకోండి.
భోజనం తర్వాత చిన్నపాటి నడక జీర్ణక్రియకు, షుగర్ లెవల్స్ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. తీవ్రమైన గుండె లేదా జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు ఈ నియమాలను పాటించే ముందు తమ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం