ఏపీలో మరో జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదే బెంగళూరు-కడప- విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే. దీనికి ఎన్హెచ్ 544జీగా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ హైవే పనులు శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే హైవే పనులు 61.72 శాతం పూర్తవ్వగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మిగతా 40 శాతం పనులను కూడా పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అనంతరం ఫిబ్రవరి 28న ఈ కొత్త నేషనల్ హైవేను ప్రారంభించాలని అధికారులు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇటీవల ఈ హైవే భూసేకరణకు సంబంధించి హైకోర్టులో మూడు కేసులు నమోదయ్యాయి.
ఈ మూడు కేసులపై పరిష్కారం లభించడంతో పనులు మరింత షురూ అయ్యాయి. ఈ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి కడప మీదుగా బెంగళూరు వెళ్లేవారికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. గతంలో విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లడానికి 12 గంటల సమయం పట్టేది.
కానీ ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే కేవలం 8 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చన్నమాట. అంటే ఏకంగా నాలుగు గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇక హైవేలో ఇంటర్ చేంజ్లు, రెస్ట్ ఏరియాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు అనేక సౌకర్యాలు ఉండనున్నాయి.
ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఇటీవల కడప జిల్లాల్లో భూసేకరణకు సంబంధించి అవార్డు లభించాల్సి ఉండగా.. ఇటీవల ఆర్వో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో కడప జిల్లాలో హైవే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. అటు కడప జిల్లా నుంచి తిరుపతి హైవే పనులు కూడా జరుగుతున్నాయి.




