
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కలంకారి కళకి అరుదైన గౌరవం లభించింది. దేశ అత్యున్నతమైన రాష్ట్రపతి భవన్ లో కలంకారీ చిత్రాలకు స్థానం దక్కింది. వందేళ్ళ క్రితం బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన చిత్రాల స్థానంలో శ్రీకాళహస్తి కళాకారులు గీసిన కలంకారీ చిత్రాల ప్రదర్శనకు రాష్ట్రపతి భవన్ అవకాశం కల్పించింది. ప్రాచీన కళకు అరుదైన గౌరవం దక్కింది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి. దక్షిణ కాశీగా రాహు కేతు క్షేత్రంగానే కాదు కళలకు కాణాచిగా విరాజిల్లుతోంది. కలంకారీ కళతో శ్రీకాళహస్తికి జాతీయ గుర్తింపు లభిస్తోంది. వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే కళ ఇప్పుడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కొనియాడబడుతోంది. శ్రీకాళహస్తిలో పుట్టిన కలంకారీ కళ పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలలో లభించినట్లు చరిత్ర చెబుతోంది. వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం ఆధారంగా కలంకారీ కళ చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. బౌద్ధ ఆరామాలు కూడా ఈ కలంకారీ వస్త్రాలతో అలంకరించే వారని అలెగ్జాండర్ కూడా కలంకారీ వస్త్రాలను తనతోపాటు తీసుకువెళ్ళాడన్న విషయం ప్రాచుర్యంలో ఉంది.
10వ శతాబ్దంలో పర్షియన్, భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చని తెలుస్తోంది. ఐరోపా వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలిచేవారని, కృష్ణా జిల్లా పెడనలో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ గా ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుతం బ్లాక్ ప్రింటింగ్స్ పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు హస్త కళలుగా శ్రీకాళహస్తి నుండి వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవటంలో కూడా కొంత మంది పెడన తరహాలోనే బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో నెలకొన్న కలంకారీ అద్ధక పరిశ్రమ కేవలం సహజ, హానికారకాలు లేని రంగులతో చిత్రాలు వేయడం ఈ కళలో ప్రత్యేకత. రంగులను మొక్కలు, కూరగాయల నుంచి తయారు చేస్తుండటంతో వాతావరణానికి అనుకూలంగా వుంటుంది. అందుకే ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి భవన్ కు చరిత్రను పదిలం చేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని ఆకర్షించింది.
శ్రీకాళహస్తికి చెందిన కళాకారులను ఢిల్లీకి పిలిపించి ఒక నెలరోజుల పాటు ఆతిథ్యం ఇచ్చి కలంకారీ కళను ప్రోత్సహించింది. శ్రీకాళహస్తి కి చెందిన 21 మంది కలంకారీ కళాకారుల చేత 21 చిత్రాలను వేయించింది. రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము స్వయంగా పర్యవేక్షించి కలంకారీ కళాఖండాలను చిత్రీకరించేలా సహకరించారు. కామధేనువు, మహావిష్ణువు, కావేరి, గోదావరి, కల్పవృక్షం వంటి చిత్రాలను రూపొందించిన కళాకారులను సన్మానించి రాష్ట్రపతి భవన్ లో విందు ఏర్పాటు చేసిన రాష్ట్రపతి మరిన్ని కలంకారి చిత్రాలను వేసి రాజ్ భవన్ కు అందించాలని కోరడంతో శ్రీకాళహస్తికి చెందిన కలంకారి చిత్రకారుల ఆనందానికి హద్దు లేక పోతోంది.
ఏపీ అసెంబ్లీ లోనూ ఏర్పాటు కు ప్రయత్నం.
ఇలా పురాతన హస్తకళకు లభించిన గుర్తింపు, ఆదరణ తో శ్రీకాళహస్తి కళాకారులను మరింతగా ప్రోత్సహించినట్లు అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ కలంకారీ కళాఖండాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబుకు కళాకారుల నుంచి విజ్ఞప్తి వస్తోంది.