
తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా కుదువాంచెరి సమీపంలోని కన్నివాక్కంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో రెండున్నర సంవత్సరాల చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మరణించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. మృతులు స్థానికంగా నివాసం ఉంటున్న తండ్రి పార్థిబన్ (33), అతని భార్య జయచిత్ర (29), వారి కుమార్తె జయశ్రీగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం సోమవారం సాయంత్రం పొలం పని చేసుకొని వచ్చారు. రాత్రి భోజనం చేసి నిద్ర పోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో, పడుకునే ముందు దోమల నుంచి ఉపశమనం కోసం దోమల కాయిల్ను వెలిగించారు. అయితే రాత్రి గాలికి ఈ కాయిల్ నిప్పు రవ్వలు ఇంట్లోని మండే వస్తువులపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే ఆ మంటలు ఇంటి మొత్తం వ్యాపించాయి. దీంతో ఇళ్లు మొత్తం పొగతో నిండిపోయింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉండిపోయిన ఆ కుటుంబం ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది.
తెల్లవారుజామున ఇంటి నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు మంటలను అదుపుచేసింది. మృతదేహాలను వెలికి తీశారు. అనతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుడువాంచెరి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.