
Laptop Prices: ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కొనాలని భావిస్తున్న వినియోగదారులకు ఈ ఏడాది ఖర్చు మరింత పెరగనున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాసెసర్లు, గ్రాఫిక్స్ కార్డులు (GPUలు), మెమరీ వంటి కీలక కంపోనెంట్ల ధరలు పెరుగుతుండటంతో కంప్యూటర్ల ధరలు 35 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం DDR RAM ధరలు భారీగా పెరగడం, ఎంట్రీ లెవల్ Intel ప్రాసెసర్ల కొరత అని విశ్లేషకులు తెలిపారు.
2025లో రికార్డు విక్రయాలు:
మార్కెట్ పరిశోధనా సంస్థ IDC ప్రకారం.. భారతీయ పీసీ మార్కెట్ 2025లో అత్యుత్తమ సంవత్సరం నమోదు చేసింది. డెస్క్టాప్లు, నోట్బుక్లు, వర్క్స్టేషన్లు కలిపి 1.59 కోట్ల యూనిట్లు షిప్ అయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 10.2 శాతం వృద్ధి. ఇదే మొదటిసారి సంవత్సరానికి 1.5 కోట్లకు పైగా పీసీలు విక్రయించారు. డిసెంబర్ త్రైమాసికంలో మాత్రమే 41 లక్షల యూనిట్లు మార్కెట్కు చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 18.5 శాతం వృద్ధి. మార్కెట్లో HP మొదటి స్థానంలో ఉండగా, తర్వాత Lenovo, Dell, Acer, Asus సంస్థలు ఉన్నాయి. ఈ ప్రధాన బ్రాండ్లన్నీ 2025లో మంచి వృద్ధిని నమోదు చేశాయి.
పెరుగుతున్న కంపోనెంట్ ధరలు:
కంప్యూటర్ తయారీలో ఉపయోగించే RAM ధరలు ఇప్పటికే 2.5 నుంచి 3 రెట్లు పెరిగాయి. దీంతో ల్యాప్టాప్లు, డెస్క్టాప్ల ధరలు ఇప్పటికే 10–12 శాతం వరకు పెరిగాయి. మార్కెట్ విశ్లేషకుడు భరత్ షెనాయ్ ప్రకారం, మార్చి నెలలో మరో 8–10 శాతం ధర పెరుగుదల ఉండే అవకాశం ఉంది. వచ్చే కొన్ని నెలల్లో మరొక 10 శాతం వరకు పెరుగుదల ఉండొచ్చని తెలిపారు. ఇంతకుముందు రూ.30,000–35,000 మధ్య ఉన్న ల్యాప్టాప్లు ఇప్పుడు రూ.45,000కు చేరువ అవుతున్నాయి. దీంతో విద్యార్థులు, ఇంటి వినియోగదారులు, మొదటిసారి కొనేవారికి కంప్యూటర్ కొనడం కాస్త కష్టంగా మారుతోంది.
India Gas Crisis: హైదరాబాద్లో హోటళ్లు, రెస్టారెంట్లు బంద్.. హోటల్స్ అసోసియేషన్స్ కీలక నిర్ణయం!
2027 వరకు ధరలు తగ్గకపోవచ్చు:
పరిశ్రమ నిపుణుల అంచనాల ప్రకారం.. కంప్యూటర్ ధరలు వచ్చే 6–7 త్రైమాసికాల వరకు పెరుగుతూనే ఉండవచ్చు. 2027 రెండో అర్ధభాగం వరకు ధరలు తగ్గే అవకాశం తక్కువగా ఉందని వారు చెబుతున్నారు. అందుకే కొన్ని కంపెనీలు, వినియోగదారులు ధరలు ఇంకా పెరగకముందే ముందుగానే కొనుగోళ్లు చేయాలని చూస్తున్నారు.
డిమాండ్ తగ్గే అవకాశం:
ధరలు పెరుగుతుండటంతో వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని మార్కెట్ సంస్థలు చెబుతున్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విశ్లేషకురాలు అన్షిక జైన్ ప్రకారం, DRAM, NAND మెమరీ ధరలు పెరగడం పీసీ పరిశ్రమకు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం AI డేటా సెంటర్లు, సర్వర్లకు ఎక్కువ మెమరీ అవసరం ఉండటంతో సరఫరా అక్కడికే మళ్లుతోంది. దీనివల్ల సాధారణ కంప్యూటర్ తయారీదారులకు ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో ఎంట్రీ లెవల్ వినియోగదారులు కొత్త ల్యాప్టాప్ కొనుగోలు చేయడం ఆలస్యం చేయవచ్చు లేదా తక్కువ స్పెసిఫికేషన్ మోడళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే గేమింగ్, క్రియేటివ్ వర్క్, ఎంటర్ప్రైజ్ వినియోగదారుల డిమాండ్ మాత్రం కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు.
Rapido: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షకుపైగా రైడ్లు ఈ ప్రాంతంలోనే..!
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ప్రభావం:
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగి హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అంతరాయం ఏర్పడితే సెమీకండక్టర్ తయారీకి అవసరమైన ఇంధనం, పెట్రోకెమికల్ సరఫరా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం కంప్యూటర్ కంపోనెంట్ల ధరలపై కూడా పడే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడే కొనడం మంచిదా?
కైలాష్ లఖ్యాని (ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు) ప్రకారం.. గత నవంబర్ నుంచి ల్యాప్టాప్ ధరలు ప్రతి నెల పెరుగుతూనే ఉన్నాయి. మెమరీ ధరలు, డాలర్ మార్పిడి విలువ, ద్రవ్యోల్బణం, పశ్చిమ ఆసియా సంక్షోభం వంటి అంశాలు ఈ ధోరణిని మరింత పెంచుతున్నాయని ఆయన చెప్పారు. అసెంబుల్డ్ కంప్యూటర్ల మార్కెట్లో కూడా బ్లాక్ మార్కెట్ కార్యకలాపాల వల్ల ధరలు మరింత పెరిగినట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ధరలు ఇంకా పెరగకముందే కంప్యూటర్ కొనుగోలు చేయడం వినియోగదారులకు మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Bitter Gourd: ఇలా చేశారంటే చాలు కాకరకాయలో చేదు అస్సలు ఉండదు.. పిల్లలు కూడా ఇష్టపడతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి